ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే ఈ సీజన్ లో వినియోగించే పిచ్లపై అసంతృప్తి వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హోం గ్రౌండ్స్లో పిచ్లు, సొంత జట్లకు అనూకూలంగా లేవనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె.. ఓపెనింగ్ మ్యాచులో ఆర్సీబీపై ఓటమి చెందిన తర్వాత ఈడెన్ గార్డెన్స్ పిచ్ తమకు అనుకూలంగా లేదని చెప్పడంతో వివాదం మొదలైంది. ఈ విషయంపై క్యూరేటర్ - రహానె మధ్య చిన్నపాటి మాటల యుద్దం కూడా నడిచింది.
ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ కూడా..పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరిగిన తర్వాత తమ హోమ్ పిచ్ ను పంజాబ్ క్యూరేటర్ తయారు చేసినట్లుగా ఉందని అనడం చర్చనీయాంశమైంది. దిల్లీ క్యాపిటల్స్ కూడా తమ హోమ్ పిచ్ లపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అందింది.

ముందే మాట్లాడుకోవాలి..
ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై ఓ బీసీసీఐ ప్రతినిధి స్పందించారు. ఈ పిచ్ల తయారీ విషయంలో బీసీసీఐకి ఎటువంటి ఇష్యూ లేనట్లు సదరు ప్రతినిధి తెలిపారు. ఆయా ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన విధంగా ముందుగానే క్యూరేటర్లతో కమ్యూనికేట్ చేసి, పిచ్ ను తయారు చేయించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. సీజన్ మధ్యలో, మ్యాచ్ అయిపోయాక వాటి గురించి మాట్లాడం కన్నా.. ముందుగానే క్యూరేటర్లతో చర్చించాలని చెప్పారు.
అవి బానే ఉన్నాయి..
"పిచ్ లు బానే ఉన్నాయి. కాకపోతే వారు పిచ్ లను బౌలర్లకు మరింత ఉపయోగకరంగా తయారు చేయాలని అడుగుతున్నారు. ఫ్రాంఛైజీలు - క్యూరేటర్ల మధ్య మరింత బెటర్ కమ్యూనికేషన్ ఉంటే మంచిది. అప్పటికప్పుడు పిచ్ ల గురించి చెబితే కుదరదు. ముందుగానే మాట్లాడుకుని రూపొందించుకోవాలి." అని సదరు బీసీసీఐ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, వాస్తవానికి బీసీసీఐ గైడ్ లైన్స్ ప్రకారం.. ఫ్రాంఛైజీ కానీ, ప్లేయర్ కానీ పిచ్ ల విషయమై ఎటువంటి హక్కు ఉండదని సమాచారం. క్యూరేటర్లే సీమ్, స్పిన్ బౌలింగ్ మధ్య సమతుల్యం ఉండేలా పిచ్ తయారు చేయాలి.