IPL 2025: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే బ్యాటర్ ఆయుష్ మాత్రే విధ్వంసం సృష్టించాడు.ఒకే ఓవర్లో 28 పరుగులు బాదాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ దాటిస్తూ రెచ్చిపోయాడు. గుజరాత్ పేసర్ అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వరుసగా ఆరు బంతుల్లో 2,6,6,4,4,6 ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అర్షద్ ఖాన్ ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆయుష్ మాత్రే ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ 2 ఓవర్లలోనే 34 పరుగులు చేసింది. అర్షద్ బౌలింగ్ లో 3 సిక్సులు, 2 బౌండరీలు బాదాడు. ఆయుష్ మాత్రే మొత్తంగా 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ జట్టును ఓ ఆట ఆడుకున్నాడు.
తన బ్యాటింగ్ తో అదరగొట్టిన ఆయుష్ మాత్రే.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆయుష్ మాత్రే ఔటైన తర్వాత ఉర్విల్ పటేల్ దంచికొట్టాడు. 19 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. సాయి కిషోర్ వేసిన 10వ ఓవర్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. అనంతరం శివమ్ దూబే, డెవాన్ కాన్వేలు రెచ్చిపోయి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపించింది. కానీ శివమ్ దూబే 8 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతానికి 12.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. కానీ ఇదే జోరును కొనసాగిస్తే ఈజీగా 200 స్కోరు దాటుతుంది.

ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం సీఎస్కే ప్లేయింగ్-11లో ఒక మార్పు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంది. గుజరాత్ కూడా ఒక మార్పు చేసింది. రబాడా స్థానంలో కోయెట్జేకు అవకాశం లభించింది.
అండర్-19 జట్టు కెప్టెన్సీని కూడా పొందిన ఆయుష్ మాత్రే
ఆయుష్ మాత్రే ఇటీవలే భారత అండర్-19 జట్టుకు కెప్టెన్సీని కూడా పొందాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అతను 7 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో ఆయుష్ మాత్రే 34 సగటు 189 స్ట్రైక్రేట్తో 189 పరుగులు చేశాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇదే చివరి మ్యాచ్ కూడా. ఐపీఎల్కు ముందు ఆయుష్ మాత్రే ఎక్కువగా టీ20 మ్యాచ్లు ఆడలేదు. ముంబై తరఫున 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 504 పరుగులు చేశాడు. ఆయుష్ 7 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 458 పరుగులు చేశాడు. ఈ కాలంలో ఆయుష్ మాత్రే 4 సెంచరీలు సాధించాడు.