ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నారు. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా, 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.
విదేశీ ప్లేయర్లలో 42 ఏళ్ల ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే ప్రతి ఫ్రాంచైజీ మరో మూడేళ్లు పాటు జట్టుకు సేవలు అందించే ఆటగాళ్లను, తమ వ్యూహాలకు తగ్గట్లుగా వేలంలోకి ఎంచుకోవాలని భావిస్తుంటుంది. అయితే ఐపీఎల్-2027 వరకు అండర్సన్ వయస్సు 45 ఏళ్లు అవుతుంది.

ఒక్క సీజన్ లేదా రెండు సీజన్ల కోసం అండర్సన్కు ధరను వెచ్చించాదమనుకుంటే.. అతను రూ.1.50 కోట్లు కనీస ధరతో వేలానికి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అండర్సన్ కోసం ఏ ఫ్రాంచైజీ అయినా ఆసక్తి చూపుతుందా లేదా అంచనాలకు భిన్నంగా అతను భారీ ధర పలుకుతాడా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అయితే మెగా వేలంలో అండర్సన్ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంటుందని ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
''జేమ్స్ అండర్సన్ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంటే, అందులో ఆశ్చర్యమేమి ఉండదు. తొలి ఓవర్లలో స్వింగ్ను ఉపయోగించే జట్టు సీఎస్కే. ఆ జట్టులో ఎప్పుడూ ఓ స్వింగ్ బౌలర్ ఉంటారు. శార్దూల్ ఠాకూర్ లేదా ఇతరత్రా బౌలర్లు జట్టులో ఉంటూనే ఉంటారు. అందుకే అండర్సన్ను సీఎస్కే దక్కించుకుంటే నాకేం ఆశ్చర్యంగా అనిపించదు'' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
కాగా, జేమ్స్ అండర్సన్ ఇప్పటివరకు ఐపీఎల్లో అరంగేట్రం చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డులు సాధించిన అండర్సన్.. ఈ ఏడాది టెస్టులకూ గుడ్బై చెప్పాడు. అయితే ఐపీఎల్ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోవడంపై అండర్సన్ ఇటీవల స్పందించాడు. తనకి మళ్లీ క్రికెట్ ఆడాలని ఉందని, అందుకే ఐపీఎల్ ఆక్షన్లో పాల్గొంటున్నాని తెలిపాడు.