ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. రిషభ్ పంత్ (రూ.27 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు- కేకేఆర్) భారీ ధర దక్కించుకున్నారు. బిహార్కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లు వెచ్చించింది.
యువ ఆల్రౌండర్ అన్షుల్ కాంబోజ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.40 కోట్లు ఖర్చు పెట్టింది. హిట్టర్ ప్రియాన్ష్ ఆర్య కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.3.80 కోట్ల భారీ ధర వెచ్చించింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే మెగా వేలంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ వేలం ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ, ఆర్సీబీ సీఈవో ప్రథమేశ్కు షేక్ హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన విల్ జాక్స్ను ముంబై ఇండియన్స్ రూ. 5.20 కోట్లకు దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్తో తీవ్రంగా పోటీపడి అంతిమంగా దక్కించుకుంది.
ఆర్సీబీకి ఆర్టీఎమ్ ఆప్షన్ ఉండటంతో ఆక్షనీర్ మల్లికా సాగర్.. ఆర్టీఎమ్ కార్డ్ వాడుతారా? అని ప్రశ్నించింది. గత సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన జాక్స్ ఓ సెంచరీతో 32 సగటుతో 230 పరుగులు చేశాడు. ఆఫ్స్పిన్తో రెండు వికెట్లు కూడా తీశాడు. ఈ నేపథ్యంలో విల్ జాక్స్ ఆర్సీబీని తిరిగి దక్కించుకుంటుందని భావించారంతా. కానీ జాక్స్ కోసం బెంగళూరు ఫ్రాంచైజీ ఆర్టీఎమ్ ఉపయోగించలేదు. దీంతో విల్ జాక్స్ ముంబైకి సొంతమయ్యాడు. మరోవైపు జాక్స్-ఆక్షన్ ముగిసిన అనంతరం ప్రథమేశ్.. ఆకాశ్ అంబానీ వైపు చూపిస్తూ 'డన్' అంటూ సిగ్నల్ ఇచ్చాడు.
BIGGEST MOMENT OF THE DAY.
— Johns. (@CricCrazyJohns) November 25, 2024
- Akash Ambani hugging with RCB management as they decide not to use RTM for Will Jacks. pic.twitter.com/S4nEbwn3j8
అనంతరం ఎంతో సంతోషానికి గురైన ఆకాశ్ అంబానీ.. వెంటనే ఆర్సీబీ టేబుల్ దగ్గరకు వెళ్లి ప్రథమేశ్కు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముంబై ఇండియన్స్-ఆర్సీబీ ఫ్రాంచైజీలు ఫిక్సింగ్తో వేలానికి వచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ రెండు ఫ్రాంచైజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ ప్లేయర్ టిమ్ డేవిడ్ తమకు రూ.3 కోట్లకే సొంతమయ్యాడనే ఆనందంతో ఆర్సీబీ ఇలా చేసి ఉండొచ్చని వాదనలు వస్తున్నాయి.