RCB VS PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడేందుకు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కీలక పేసర్ అర్షదీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ జట్టుతో తన ప్రయాణం ఎలా సాగుతోంది, కెరీర్ ప్రారంభంలోనే జట్టు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించింది, సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ కు తాను ఎలా ఫీల్ అవుతాడో అన్నీ చెప్పుకొచ్చాడు. 'కాండిడ్ విత్ కింగ్స్' అనే కార్యక్రమంలో వీటి గురించి మాట్లాడాడు.
అలా అనుకుంటూ ముందుకు సాగా..
తన కెరీర్ ప్రారంభ దశ నుంచే జట్టులో కీలకమైన బాధ్యతలు అందుకున్నట్లు అర్షదీప్ సింగ్ తెలిపాడు. "పంజాబ్ కింగ్స్కు వచ్చిన తొలి సంవత్సరం మినహా.. ఆ తర్వాత అంత నాకు నేను ఓ సీనియర్ లా భావిస్తూ కెరీర్ లో ముందుకు సాగాను. గత ఏడు సంవత్సరాలుగా ఈ జట్టుతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. తొలి ఏడాది గడిచాక.. నాకు పెద్ద బాధ్యతలు అప్పగించారని నాకు నేనే అనుకుంటూ ఆడటం ప్రారంభించాను. ఇది నన్ను ఆటగాడిగా, వ్యక్తిగా ఎదగడానికి ఎంతగానో సాయపడింది." అని పేర్కొన్నాడు.

జట్టు ఇబ్బందుల్లో పడుతుందని...
కెరీర్ ప్రారంభంలోనే వృద్ధి చెందడం.. ఆట పట్ల తన విధానాన్ని, దృక్పథాన్ని ఎంతో మార్చిందని.. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో ఎలా ఉండాలనేది నేర్పించిందో వివరించాడు: "నా పాత్రలో వృద్ధి, కెరీర్ లో ఎదుగుదల త్వరగా వచ్చింది. దీంతో కీలక సమయాల్లో తప్పులు ఎలా చేయకుండా ఉండాలో తెలుసుకున్నాను. పక్కా ప్రణాళిక ప్రకారం పని చేయకపోతే జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని తెలుసుకున్నాను. అందుకే తక్కువ సమయంలోనే బాధ్యతాయుతంగా మారి, నన్ను నేను సీనియర్గా భావించుకోవడం, వారిలా ఆలోచించడం ప్రారంభించాను." అని చెప్పుకొచ్చాడు.
ఫుల్ ఎంటర్టైనింగ్గా...
సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ను తాను ఎలా స్వీకరిస్తాడో చెప్పాడు అర్షదీప్ సింగ్. "నా కెరీర్లో ఎన్నో ఎత్తులు, పతనాలు చూశాను. చాలా తక్కువ సమయంలోనే పెద్ద విజయాల్ని చూశాను, అలానే క్లిష్ట పరిస్థితుల్తని చూశాను. అయితే ఈ ట్రోల్స్ నాకు ఎంతో ఫన్నీగా, ఎంటర్టైనింగ్గా ఉంటాయి. వారి క్రియేటివిటీ, మీమ్స్ చూసి తెగ నవ్వుతుంటాను. ఆ మీమ్స్ను, మెసేజెస్ను సేవ్ చేసుకుని తర్వాత ఉపయోగించాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోను. అయినా కూడా మీమర్స్, ట్రోలర్స్ క్రియేటివిటీ చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాను. " అని చెప్పారు.