ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.
వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి. ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా ఎవరిని దక్కించుకోవాలి, భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలని స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ దగ్గర ఉన్న మూడు ఆర్టీఎమ్ కార్డ్లతో స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత సీజన్లో వరుసగా విజయాలతో హోరెత్తించి ప్లేఆఫ్స్కు చేరుకున్నఆర్సీబీ.. ముగ్గరు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాల్ కోసం రూ.37 కోట్లు వెచ్చించింది. మిగిలిన రూ.83 కోట్లతో ఆర్సీబీ గరిష్టంగా 22 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో 8 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.
అయితే ఈ క్రమంలో ఆర్సీబీ ఆర్టీఎమ్ ఉపయోగిస్తూ వీలైనంత తక్కువ మొత్తంతో నాణ్యమైన ప్లేయర్లను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాప్ డుప్లెసిస్, మహ్మద్ సిరాజ్, విల్ జాక్స్లలో ముగ్గురు ప్లేయర్లను తిరిగి గూటిచి చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. 36 ఏళ్ల మ్యాక్సీ గత ఐపీఎల్ సీజన్లో పేలవమైన ప్రదర్శన చేశాడు. అయితే ఫామ్ కంటే తన క్లాస్, ఆఫ్ స్పిన్, ఫీల్డింగ్లో నేర్పును చూసి ఆర్టీఎమ్ ఉపయోగించాలని ఆర్సీబీ భావిస్తోంది.
మరోవైపు 40 ఏళ్ల డుప్లెసిస్ను కూడా ఆర్టీఎమ్తో తిరిగి దక్కించుకోవాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తోంది. గత మూడు సీజన్లలో జట్టును డుప్లెసిస్ రెండు సార్లు ప్లేఆఫ్స్కు చేర్చాడు. ఇటీవల కరేబియన్ లీగ్లో సెయింట్ లూసియా కింగ్స్ను విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో డుప్లెసిస్ను తిరిగి తమ గూటికి తెచ్చుకుని కెప్టెన్సీ ఇచ్చే యోచనలోనూ బెంగళూరు ఫ్రాంచైజీ ఉంది. ఇక 2018 నుంచి బెంగళూరుతో ఉంటున్న సిరాజ్ కోసం ఆర్సీబీ తమ ఆర్టీఎమ్ కార్డ్ను ఉపయోగించాలని చూస్తోంది. ఈ ముగ్గురితో పాటు ఆల్రౌండర్ విల్ జాక్స్ను కూడా తిరిగి దక్కించుకోవాలని బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంది.
ఈ నలుగురిలో ఆర్టీఎమ్తో ముగ్గురిని దక్కించుకోవడానికి ఆర్సీబీ ప్రధాన వ్యూహంతో మెగావేలంలో వెళ్లనుంది. ఒకవేళ వ్యూహాలు ఫలించకపోతే... విజయ్కుమార్ వైశాక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రార్లలో కొందరిని దక్కించుకోవాలని చూస్తోంది.