KL Rahul VS Sanjiv Goenka: ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతోన్న కేఎల్ రాహుల్ టెర్రిఫిక్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో రాహుల్ 60.67 సగటుతో, 146.18 స్ట్రైక్రేట్ తో మొత్తం 364 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శన చూస్తుంటే రాహుల్ గతేడాది తన మాజీ జట్టులో తనకు జరిగిన అవమానికి సమాధానంలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా, గతేడాది రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సమయంలో గోయెంకా అందరి ముందే మైదానంలో రాహుల్ తో దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత స్వేచ్ఛగా ఆడాలనే ఉద్దేశంతో లక్నో వదిలి.. ఢిల్లీ క్యాపిటల్స్లో చేరినట్లు రాహుల్ తెలిపాడు.

అంతా రాహుల్ కంట్రోల్ లోనే..
అయితే తాజాగా లక్నో మాజీ ఆటగాడు అమిత్ మిశ్రా.. కేఎల్ రాహుల్, సంజీవ్ గోయెంకా జట్టుతో ఎలా ప్రవర్తిస్తారో వివరించాడు. "గత సీజన్లో కోచ్తో మాట్లాడాను. అప్పుడు కెప్టెన్ కేఎల్ రాహులే జట్టుకు సంబంధించిన అన్నీ విషయాలు చూసుకునేవాడని కోచ్ నాతో చెప్పాడు. ప్లేయింగ్ 11కు సంబంధించి, జట్టులో ఇతర మార్పులు, ప్రణాళికలు, నిర్ణయాలు అన్నీ తనే తీసుకునేవాడు. కానీ ఈ సారి అలా లేదు. జహీర్ ఖాన్ వచ్చాక అతడు అందరితో కలిసి చర్చిస్తున్నాడు. అందరి నిర్ణయాలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరితో కలిసి చర్చిస్తున్నాడు. దిగ్వేశ్ రథి వంటి వారితోనూ కోచ్ మాట్లాడుతున్నాడు." అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు బట్టి కేఎల్ రాహుల్.. జట్టును నియంత్రించేవాడని మిశ్రా పరోక్షంగా చెప్పాడు.
మీడియానే ఓవర్ చేస్తోంది..
"సంజీవ్ గోయెంకా విషయానికొస్తే.. అతడు ఎక్కువగా జోక్యం చేస్తున్నట్టు నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎప్పుడూ జట్టు గలవాలనే ఉద్దేశ్యంతోనే ఉంటాడు. మేం మ్యాచులు ఓడిపోయాక కూడా ఆయన గట్టిగా, తప్పుగా మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదు. అనవసరంగా మీడియానే కాస్త ఓవర్ గా చూపించినట్లు అనిపిస్తోంది. మీడియాలో చూపించినంత నెగటివిటీ నాకు ఇక్కడ కనిపించలేదు. అయితే ఓ యజమాని ఎప్పుడైనా.. ఓడినా పర్వాలేదు, కానీ పోరాడి ఓడండి. పోరాడి ఓడితే నాకు ఏ సమస్య లేదు. అని మాత్రమే చెబుతారు. కోల్కతా, హైదరాబాద్లో దారుణంగా ఓడినప్పుడు కూడా ఆయన డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి జట్టును ప్రోత్సహించారు. గట్టిగా, తప్పుగా, అవమానించేలా మాట్లాడలేదు." అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.