వ్యక్తిగత రికార్డుల కోసం కాదు జట్టు కోసం ఆడేవాడే అసలైన నాయకుడని శ్రేయస్ నిరూపించాడు. 'ఇది టీమ్ గెమ్, నా సెంచరీ కోసం ఆలోచించొద్దు, నువ్వు ఆడు' అని తాజాగా జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచులో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్న మాటలు ప్రస్తుతం క్రీడా స్ఫూర్తిని చాటుతున్నాయి. ఈ క్రమంలోనే అతడిపై అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదే సమయంలో శ్రేయస్ తో పోలుస్తూ ముంబయికు చెందిన దిగ్గజ క్రికెటర్లపై సెటైర్లు వేశాడు!
ముంబయి క్రికెటర్లు సాధారణంగా వ్యక్తిగత రికార్డు కోసం చూస్తారు, కానీ అయ్యర్ మాత్రం అలా చేయలేదని పేర్కొన్నాడు అంబటి రాయుడు. శ్రేయస్.. జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వడమనేది ఓ కొత్త మార్పు అని అన్నాడు. తాను చూసిన ముంబయి క్రికెటర్స్ లో ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న ప్లేయర్ ను చూడటం ఇదే తొలిసారి అన్ని చెప్పాడు.

"ముంబయి క్రికెటర్లు సాధారణంగా భారీ స్కోర్లు, సెంచరీలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నాకు తెలిసి అయ్యర్ కూడా సెంచరీలు అనే పదమే ఎక్కువగా వింటూ పెరిగి ఉంటాడు. కానీ ముంబయి నుంచి వచ్చిన ఈ బ్యాటర్ వల్ల ఓ చిన్న మార్పు వచ్చింది. అతడు వ్యక్తిగత రికార్డు కోసం కాకుండా జట్టు కోసం నిజాయతీగా ఆటడం మంచి విషయం అని భావిస్తున్నాను. సాధారణంగా మీరో టీమ్ ప్లేయర్ అయినా, మీ సహచరుడు సెంచరీకి దగ్గరగా ఉన్నాడంటే స్ట్రైక్ ఇవ్వాలని అనుకుంటారు. ముఖ్యంగా తమ కెప్టెన్ అయితే వ్యక్తిగత రికార్డును సాధించాలని భావిస్తారు. కానీ ఓ సారథే స్వయంగా సెంచరీకి దగ్గరగా వచ్చాక కూడా తన శతకం గురించి ఆలోచించొద్దని అనడం, స్ట్రైక్ సహచరుడికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి నాయకుడు అనేది దీని బట్టి అర్థమవుతోంది. పంజాబ్ జట్టుకు ఇలాంటి నాయకుడు ఉండటం చాలా ముఖ్యం." అని చెప్పుకొచ్చాడు.