ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆటగాళ్ల గురించి, మ్యాచుల గురించి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు కూడా తమ విశ్లేషలను అందిస్తూ మంచి మజానిస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ చరిత్రలో లేదా అంతర్జాతీయ క్రికెట్ లో కఠినమైన బౌలర్ అనగానే చాలా మందికి టక్కున గుర్తొచ్చే పేరు బుమ్రా. చాలా మంది క్రికెటర్లు, బ్యాటర్లు.. తాము ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ పేరు బుమ్రానే అని చెబుతుంటారు.
అయితే తాజాగా ప్రస్తుతం కామెంటేటర్ గా రాణిస్తోన్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ పేరు చెప్పాడు. కానీ అది బుమ్రా కాదు. తన కెరీర్ లో కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ వల్ల ఇబ్బంది పడినట్లు చెప్పాడు. తాను ఎదుర్కొన్న అతి కష్టమైన మిస్టరీ స్పిన్నర్ అతడే అని అన్నాడు.
"నన్ను అత్యధికంగా ఇబ్బంది పెట్టిన బౌలర్ సునీల్ నరైన్. అతడిని ఎదుర్కోవడం సవాల్ గా ఉండేది. నేను ఎప్పుడూ అతని బౌలింగ్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నిజానికి నేను సహజంగా, స్వేచ్ఛగా క్రికెట్ ఆడేవాణ్ని. కానీ ఏదో విధంగా, నరైన్ బౌలింగ్ను అంచనా వేయడం నాకు సాధ్యమయ్యేది కాదు. ప్రతిసారి నేను దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ, అతని బంతి ఎప్పుడూ నేను ఊహించినదానికి విరుద్ధంగా తిరిగేది." అని పేర్కొన్నాడు.
అంబటి రాయుడు తన 14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. 203 మ్యాచుల్లో 28 సగటు, 127.54 స్ట్రైక్ రేటుతో 4,348 పరుగులు చేశాడు. స్పిన్నర్లను బాగా ఎదుర్కొనేవాడు. మిడిలార్డర్ లో ఆట గతి మారుస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేవాడు.
