ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడిపోయి విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో -0.150 రన్ రేట్తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా కెప్టెన్ రిషభ్ పంత్.. అటు కెప్టెన్గా, ఇటు బ్యాటర్గా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు లక్నో జట్టుకు ఓ బిగ్ బూస్ట్ అందింది. ఆ జట్టులోకి కీలక ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇంతకీ అతడెవరంటే?
లక్నో క్యాంపులోకి ఆకాశ్ దీప్ జాయిన్ అయ్యాడు. అతడు జట్టుతో కలిసిన వీడియోను ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆకాశ్ దీప్ హోస్ లోకి వచ్చేశాడు అని రాసుకొచ్చింది. వీడియోలో ఆకాశ్ దీప్ కారులో నుంచి దిగి తన సహ ఆటగాళ్లతో కరచాలనం చేస్తూ కనిపించాడు.
అసలు ఆకాశ్ దీప్ ఎంట్రీ ఆలస్యం ఎందుకంటే
ఆకాశ్ దీప్.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అప్పటి నుంచి అతడు చికిత్స తీసుకుంటూనే ఉంటున్నాడు. 2024 డిసెంబరు నుంచి అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకూ దూరమయ్యాడు. ఇప్పుడు అతడు.. లక్నో నెక్ట్స్ ముంబయి ఇండియన్స్తో ఆడబోయే మ్యాచ్ కోసం ఎంట్రీ ఇచ్చాడు.
ఎంతకీ కొనుగోలు చేసిందంటే?
లక్నో... ఆకాశ్ దీప్ను ఐపీఎల్ 2025 వేలం పాటలో రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తో పోటీ పడి మరీ అతడిని దక్కించుకుంది. ఆకాశ్ దీప్ 2022 నుంచి ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 8 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. అందులో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఇతడు లక్నో జట్టులోకి చేరడంతో బౌలింగ్ లైనప్ లో మరింత బలం వచ్చినట్టుంది. కెప్టెన్ పంత్ కు చేతికి కూడా కొత్త అస్త్రం చేరినట్టైంది. చూడాలి మరి ఇతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో..
