రిటైన్ లిస్ట్ను ప్రకటించడానికి ఫ్రాంచైజీలకు మరో పది రోజులు మాత్రమే గడువు. అక్టోబర్ 31వ తేదీలోపు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల పూర్తి జాబితాను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రిటెన్షన్ లిస్ట్ను సిద్ధం చేయడంపై ఫ్రాంచైజీలన్నీ తీవ్రంగా పనిచేస్తున్నాయి. బీసీసీఐ ప్రకటించిన నిబంధనల ప్రకారం.. ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది.
గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ కల్పించింది. అయితే రిటెన్షన్ పాలసీ ప్రకారం.. సన్రైజర్స్ హైదరాబాద్ తమ రిటైన్ లిస్ట్ను దాదాపుగా సిద్ధం చేసింది. హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మలను తమ మొదటి మూడు ఎంపికలుగా ఎస్ఆర్హెచ్ సీఈవో కావ్య మారన్ ఖరారు చేసిందని సమాచారం. ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని కూడా రిటైన్ చేసుకోవాలని సన్రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

అయితే రిటైన్ జాబితాను ఖరారు చేస్తున్న వేళ.. సన్రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అబ్దుల్ సమద్ రంజీ ట్రోఫీలో ఆల్టైమ్ రికార్డులు సాధిస్తున్నాడు. కటక్లో ఒడిస్సాతో జరిగిన మ్యాచ్లో సమద్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీతో కదం తొక్కాడు. మొదటి ఇన్నింగ్స్లో 117 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 108 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో ఒడిస్సా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్లో రెండు సెంచరీలు సాధించిన మొదటి జమ్ము కశ్మీర్ ప్లేయర్గా అబ్దుల్ సమద్ రికార్డు నెలకొల్పాడు. అంతేగాక ఓ రంజీ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో భారత ప్లేయర్గా ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 15 సిక్సర్లు బాదిన అబ్దుల్ సమద్ కంటే ముందు స్థానాల్లో తన్మయ్ అగర్వాల్ (26 సిక్సర్లు), రిషభ్ పంత్ (21) మాత్రమే ఉన్నారు.
అయితే గత సీజన్లో నిరాశపరిచిన అబ్దుల్ సమద్ను సన్రైజర్స్ పక్కనపెట్టాలని స్పష్టంగా నిర్ణయించుకుంది. కానీ అతను సెంచరీలతో సత్తాచాటడంతో కావ్య మారన్ తిరిగి ఆలోచనలో పడింది. అన్క్యాపడ్ ప్లేయర్ కింద అతన్ని రూ.4 కోట్లకు తిరిగి రిటైన్ చేసుకోవాలని యోచిస్తోంది. అయితే క్లాసెన్, కమిన్స్, అభిషేక్, నితీశ్, హెడ్లకు భారీ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. ఈ స్థితిలో అబ్దుల్ను తీసుకోవాలా లేదా విడిచిపెట్టాలా అని కావ్య మేడమ్ అయోమయంలో పడింది.