ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్పై టీమిండియా సీనియర్ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో హుస్సేన్ తనని వెన్నుపోటు పొడిచాడని, కానీ ఇప్పుడు ప్రశంసిస్తున్నాడని కార్తీక్ పేర్కొన్నాడు. అసలేం జరిగిందంటే..ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న కార్తీక్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సత్తాచాటాడు. 10 బంతుల్లో అజేయంగా 28 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
దీంతో ఆర్సీబీని గెలిపించిన డీకేను నాజన్ హుస్సేన్ కొనియాడాడు. గొప్పగా ఆడావని ప్రశంసిస్తూ టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నాడు. అయితే దీనిపై దినేశ్ కార్తీక్ సరదాగా స్పందించాడు. తన హ్యుమర్తో నాజర్ను ఆటపట్టించాడు. క్రికెటర్గానే కాకుండా వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దినేశ్ కార్తీక్కు నాజర్ హుస్సేన్ మంచి స్నేహితుడు. ఈ నేపథ్యంలో డీకే తన జోకులతో నాజర్ను టీజ్ చేశాడు.

''నాజర్ హుస్సేన్.. నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నేను నమ్మను. నన్ను ఓ వ్యక్తిగా, ఓ ఆటగాడిగా, వికెట్కీపర్గా నాలో ఏ భాగాన్ని కూడా నువ్వు ఇష్టపడవు. అంతేగాక గత ప్రపంచకప్ సమయంలో జట్టులో నేను ఉండకూదని చెప్పిన ఏకైక వ్యక్తివి నువ్వే. నాతో ఇంటర్వ్యూ కూడా చేశావు. ఆ తర్వాత వెన్నుపోటు పొడిచావు. రిషభ్ పంత్ ఎక్కడా అంటూ హెడ్లైన్స్ వేశావు. నాతో మంచిగా, హాయిగా ఉన్నట్లు ప్రయత్నించకు. తర్వాత ఏం చేస్తావో నాకు తెలుసు'' అని కార్తీక్ నవ్వుతూ చెప్పాడు.
ఐపీఎల్ 2022 సీజన్లో ఫినిషర్గా సత్తాచాటిన దినేశ్ కార్తీక్ ఆ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్కు ఎంపికయ్యాడు. కాగా, మరో కొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం దినేశ్ కార్తీక్ కూడా పోటీలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కార్తీక్ ఈ సీజన్లో సంచలన ప్రదర్శన చేస్తే మెగాటోర్నీకి ఎంపికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.