ఐపీఎల్ 17వ సీజన్లో మరో స్టార్ కెప్టెన్ సారథి బాథ్యతల నుంచి తప్పుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. రాహుల్ స్థానంలో లక్నో జట్టు పగ్గాలను నికోలస్ పూరన్ అందుకున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని లక్నో ఫ్రాంచైజీ తాత్కాలికంగా తీసుకుందా లేదా ఈ సీజన్ మొత్తానికా అనే విషయంపై స్పష్టత లేదు.
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నట్లు టాస్ సందర్భంగా లక్నో నయా కెప్టెన్ నికోలస్ పూరన్ చెప్పాడు. సుదీర్ఘ టోర్నమెంట్లో ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్పై పనిభారం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని పూరన్ తెలిపాడు.

అయితే ఈ నిర్ణయం వెనకు మర్మం ఏంటనే చర్చలు మొదలయ్యాయి. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ అనంతరమే పనిభారం గురించి రాహుల్ కెప్టెన్సీని వదులుకున్నాడంటే.. అసలు అతను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదేమో అనే సందేహాలు మొదలయ్యాయి. గత ఐపీఎల్ సీజన్లో గాయపడి కొన్ని నెలల పాటు ఆటకు దూరమైన రాహుల్ ఆసియాకప్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొన్నాడు.
కానీ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో తిరిగి గాయపడ్డాడు. తొలి టెస్టు అనంతరం ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు తిరిగి ఐపీఎల్లో పునరాగమనం చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా, వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అయితే టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని పనిభారాన్ని తగ్గించుకోవాలని రాహుల్ చూస్తున్నాడా? లేదా పూర్తి ఫిట్నెస్ సాధించముందే ఐపీఎల్ ఆడుతున్నాడా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు కెప్టెన్గా విజయవంతం కాలేకపోతున్న రాహుల్పై ఫ్రాంచైజీ వేటు వేసిందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య, ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. సీఎస్కే, ముంబై ఇండియన్స్ స్ఫూర్తితో లక్నో సూపర్ జెయింట్స్ కఠిన నిర్ణయం తీసుకుందని వాదనలు వినిపిస్తున్నాయి.
అంతేగాక కేఎల్ రాహుల్ కెప్టెన్సీని వదిలిపెట్టడానికి స్ట్రైక్ రేటు కూడా ఓ కారణమని అంటున్నారు. సారథిగా సంయమనంతో ఆడటం వల్ల అతని స్ట్రైక్రేటుపై విమర్శలు వస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే దూకుడైన ఆటతీరులో పరుగులు సాధించవచ్చని, తిరిగి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకోవచ్చనే అభిప్రాయంతో రాహుల్ సారథిగా తప్పుకున్నాడనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.