స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అభిమానుకుల గుడ్ న్యూస్. కోహ్లి భారత్కు తిరిగొచ్చాడు. ముంబై ఎయిర్పోర్టులో కోహ్లి అడుగుపెట్టిన వీడియో వైరల్గా మారింది. మరికొన్ని గంటల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంప్కు కోహ్లి చేరుకోనున్నాడు. ఇవాళ సాయంత్రం నుంచి కోహ్లి సాధన మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
వ్యక్తిగత కారణాలతో కోహ్లి గత రెండు నెలలుగా టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. తన సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో కలిసి కోహ్లి విదేశాల్లో ఉన్నాడు. ఫిబ్రవరి 15న ఈ స్టార్ జంటకు కొడుకు పుట్టాడు. అతనికి అకాయ్ అని నామకరణం చేశామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కాగా, మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏడాది విరామం అనంతరం ధోనీ, రెండు నెలల తర్వాత కోహ్లి తొలిసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో చేరాడు. ఇటీవల విదర్భతో రంజీట్రోఫీ ఫైనల్లో శ్రేయస్ ముంబై తరఫున ఆడిన విషయం తెలిసిందే. అయితే చివరి రెండు రోజులు శ్రేయస్ ఫీల్డింగ్కు రాలేదు. వెన్నునొప్పి తిరిగబెట్టడంతో ఐపీఎల్లో శ్రేయస్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. కానీ తాజాగా శ్రేయస్ కేకేఆర్ క్యాంప్కు చేరుకోవడంతో లీగ్లో అతడు కొనసాగనున్నట్లు స్ఫష్టత వచ్చింది.
ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్ ఎంతో కీలకం కానుంది. తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించాలంటే లీగ్లో శ్రేయస్ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. టీ20 ప్రపంచకప్ ప్రణాళిక నుంచి శ్రేయస్ను ఇప్పటికే సెలక్టర్లు తప్పించారు. ఈ మిడిలార్డర్ బ్యాటర్కు తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబె ఆటగాళ్ల నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. వాళ్లను దాటి వరల్డ్ కప్ రేసులో నిలబడాలంటే శ్రేయస్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.