జైపుర్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్కు సంబంధించిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిలో ఓ అభిమాని కోసం సెక్యూరిటి సిబ్బందికి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సదరు ఫ్యాన్పై చేయి చేసుకోవద్దని కోహ్లి సూచించాడు. అసలేం జరిగిదంటే..
మ్యాచ్ మధ్యలో కోహ్లిని కలుసుకోవడానికి ఓ యువ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుకప్పి మైదానంలోకి ప్రవేశించాడు. నేరుగా కోహ్లి వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం ఆ ఫ్యాన్ను మైదానాన్ని వీడాలని కోహ్లి కోరాడు. ఈ లోపు సెక్యూరిటీ గ్రౌండ్లోకి వచ్చి ఆ యువకుడ్ని బయటకు తీసుకెళ్లాడానికి వచ్చారు. అయితే ఆ సమయంలో సిబ్బందితో కోహ్లి మాట్లాడాడు. అతన్ని ఏం చేయొద్దని కాస్త గట్టిగా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి కోసం ఓ ఆర్సీబీ ఫ్యాన్ స్టేడియంలోకి ప్రవేశిస్తే ఆ తర్వాత అతన్ని సిబ్బంది దారుణంగా కొట్టారు. ఇది తీవ్ర వివాదస్పదంగా మారింది. అయితే ఈ ఘటన కోహ్లి దృష్టికి వచ్చిందని, అందుకే అభిమానులపై చేయి చేసుకోవద్దని సిబ్బందికి కోహ్లి సూచించి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా అభిమానిపై విరాట్ చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మా కోహ్లి బంగారం సర్.. అంటూ కొనియాడుతున్నారు.
అయితే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113*; 72 బంతుల్లో, 12x4, 4x6) అజేయ సెంచరీ సాధించాడు. మరోసారి జట్టును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు.
అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బట్లర్ (100*; 58 బంతుల్లో, 9x4, 4x6) శతకంతో సత్తాచాటాడు. సిక్సర్తో జట్టును గెలిపించి సెంచరీని అందుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (69; 42 బంతుల్లో, 8x4, 2x6) అర్ధశతకంతో అలరించాడు.ఆర్సీబీ బౌలర్లలో టోప్లే రెండు, సిరాజ్, యశ్ దయాల్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ సీజన్లో అయిదు మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధించి తొమ్మిదో స్థానంలో ఉన్న బెంగళూరు రేపు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది.