ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. సీజన్ ఆరంభంలో ఆలస్యంగా గెలుపు రుచి చూసిన ముంబై తాజాగా మరోసారి హ్యాట్రిక్ పరాజయాల్ని చవిచూసింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పది మ్యాచ్లు ఆడిన హార్దిక్ సేన కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నుంచి రెండో స్థానంలో నిలిచింది.
నిన్నటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 144 పరుగులు చేసింది. నెహాల్ వదేరా (46; 41 బంతుల్లో, 4x4, 2x6), టిమ్ డేవిడ్ (35; 18 బంతుల్లో, 3x4, 1x6) టాప్ స్కోరర్లు. మోహ్సిన్ ఖాన్ రెండు వికెట్లు (2/36) తీశాడు. అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ స్వల్ప లక్ష్యం కోసం చెమటోడ్చింది. 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

మార్కస్ స్టొయినిస్ (62; 45 బంతుల్లో, 7x4, 2x6) అర్ధశతకంతో రాణించాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య రెండు వికెట్లు (2/26) పడగొట్టాడు. వికెట్ సాధించినప్పటికీ బుమ్రా నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చాడు. కాగా, ముంబై వరుస ఓటముల గురించి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఘూటు వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్లో బుమ్రా లేనప్పటికీ ముంబై ప్లేఆఫ్స్ సీజన్ చేరిందని, కానీ ఈ సీజన్లో స్టార్ బౌలర్ ఉన్నప్పటికీ ఆ జట్టు విజయాలు సాధించలేకపోతుందని అన్నాడు. ముంబై పరాజయాలకు కెప్టెన్ హార్దిక్ పాండ్య కారణమని పఠాన్ పేర్కొన్నాడు.
''గత సీజన్లో బుమ్రా లేకపోయినప్పటికీ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు చేరింది. ఈ సీజన్లో ముంబైకు బుమ్ర సేవలు ఉన్నాయి. అయినా ముంబై ఈ పరిస్థితుల్లోనే ఉంది. మైదానంలో జట్టును సరిగ్గా నడిపించట్లేదు. హార్దిక్ పాండ్య తప్పులు చాలా ఉన్నాయి. ఇది నిజం'' అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్లో వచ్చిన హార్దిక్ పాండ్యకు ముంబై ఫ్రాంచైజీ కెప్టెన్గా బాధ్యతలు అందించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్న హార్దిక్ సీజన్ ఆరంభం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.