Tim David and Pollard: ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ కుదేల్ అవుతోంది. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదీ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. గెలిచి తీరాల్సిన మ్యాచ్లల్లో చతికిలపడుతూ వస్తోంది. ప్లేఆఫ్స్లో చేరాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లల్లో ఓడినవే ఎక్కువ. నాలుగింట్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్ గెలిస్తే మరో దాంట్లో పరాభవాన్ని మూటగట్టుకుంటోంది. నిలకడగా విజయాలను సాధించడంలో విఫలమౌతోంది.

ఈ నెల 22వ తేదీన తన తదుపరి మ్యాచ్ను ఆడాల్సి ఉంది ముంబై ఇండియన్స్కు. రాజస్థాన్ రాయల్స్తో తలపడాల్సి ఉంది. సాయంత్రం 7:30 గంటలకు రాజస్థాన్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది. ఇందులో గెలిస్తే- ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకేసినట్టవుతుంది.
ఈ పరిస్థితుల్లో బిగ్ షాక్ తగిలిందా జట్టుకు. బ్యాటర్ టిమ్ డేవిడ్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొల్లార్డ్పై భారీ జరిమానా పడింది. వారి మ్యాచ్ ఫీజులో నుంచి 20 శాతం మేర కోత పడింది. ఇది లెవెల్ 1 అఫెన్స్. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.20 ప్రకారం వారు ఈ అఫెన్స్కు పాల్పడ్డారు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా వారిద్దరి వ్యవహారించిన తీరు జరిమానా విధించడానికి కారణమైంది.

టిమ్ డేవిడ్, కీరన్ పొల్లార్డ్ ఎలాంటి అఫెన్స్కు పాల్పడ్డారనేది తెలియరావట్లేదు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనలోనూ ఈ అంశాన్ని పొందుపరచలేదు. ఆర్టికల్ 2.20 నిబంధనను ఉల్లంఘించడం వల్ల వారిద్దరి మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత పెట్టినట్లు ఇందులో స్పష్టం చేశారు.
ఆర్టికల్ 2.20 నిబంధన ప్రకారం- ఉద్దేశపూరకంగా, నిర్లక్ష్యంగా, లెక్కలేనితనంగా వ్యవహరించినా అది శిక్షార్హమే అవుతుంది. దాని తీవ్రత ఆధారంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 4 అఫెన్స్గా నిర్ధారిస్తారు. దీనికి అనుగుణంగా జరిమానా విధిస్తారు. ప్రస్తుతం టిమ్ డేవిడ్, కీరన్ పొల్లార్డ్ లెవెల్ 1 అఫెన్స్కు పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ సంజయ్ వర్మ తెలిపారు. వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.