మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. గత సీజన్ ఎన్నో జ్ణాపకాలను మిగిలిచ్చింది. ఆఖరి బంతి విజయాలు, అబ్బుర పరిచే ఫీల్డింగ్ విన్యాసాలు, వికెట్లు ఎగరగొట్టిన యార్కర్లు, ఊహించని వివాదాలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్లో విరాట్ కోహ్లి, లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ గొడవ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు.
మ్యాచ్ అనంతరం కోహ్లి-గంభీర్ గొడవతో స్టేడియం ఒక్కసారిగా హీటెక్కిపోయింది. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న అఫ్గానిస్థాన్ క్రికెటర్, లక్నో బౌలర్ నవీనుల్ హక్ తాజాగా ఈ సంఘటను మరోసారి గుర్తుచేసుకున్నాడు. గొడవ ఎక్కడ, ఎందుకు మొదలైందో తన కోణంలో వివరించాడు.

''బెంగళూరులో జరిగిన మ్యాచ్తో ఇదంతా మొదలైంది. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో ఆర్సీబీపై మేం గెలిచాం. విన్నింగ్ రన్ సాధించిన అవేశ్ ఖాన్ ఉత్సాహంతో హెల్మెట్ను నేలకేసి కొట్టి సంబరాలు చేసుకున్నాడు. అది విరాట్ కోహ్లికి నచ్చకపోవచ్చు. ఆ తర్వాత ఆర్సీబీ లక్నోకు వచ్చింది. ఛేదన ఆఖర్లో నేను బ్యాటింగ్కు వెళ్లాను. అప్పటికే మా జట్టు ఓటమి ఖరారైంది. కాబట్టి నన్ను స్లెడ్జింగ్ చేస్తారనుకోలేదు. అయితే ఎవరైనా మొదలుపెడితే నేను అస్సలు ఊరుకోను. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ల హ్యాండ్షేక్ వరకు ఇది కొనసాగింది. కోహ్లి, సిరాజ్ కవ్వించారు''
''బెంగళూరులో జరిగిన మ్యాచ్లో మేం గెలిచిన తర్వాత గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్కు సైలెంట్ ఉండమని సింబాలిక్గా చెప్పాడు. అలా ఎందుకు చేశాడంటే.. లక్నో విజయానికి ఆఖరి బంతికి ఒక్క పరుగు అవసరమైన సందర్భంలో వాళ్లు నాన్స్ట్రైకర్ను రనౌట్ (మన్కడింగ్) చేయాలనుకున్నారు. కానీ బెయిల్స్ను బౌలర్ పడగొట్టలేకపోయాడు''
''క్రీడాస్ఫూర్తి ప్రకారం ఉత్కంఠ మ్యాచ్కు అది మంచి ముగింపు కాదు. రనౌట్(మన్కడింగ్)తో మ్యాచ్ ముగిస్తే అవమానంగా ఉండేది. అక్కడ హీట్ మొదలైంది. అందుకే ఫ్యాన్స్ను సైలెంట్గా ఉంచాలని గంభీర్ అనుకున్నాడు. గంభీర్ ఉద్వేగభరితంగా ఉంటాడు. అలాగే కోహ్లి కూడా'' అని నవీనుల్ తెలిపాడు. లక్నోలో మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల కరచాలన సమయంలో కోహ్లితో నవీనుల్ కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత గొడవలో గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు. గంభీర్-కోహ్లి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరే సమయానికి ఇరు జట్ల ఆటగాళ్లు కంట్రోల్ చేశారు. కాగా, ఈ సీజన్లో గంభీర్ లక్నోను వదిలి కోల్కతా మెంటార్గా బాధ్యతలు అందుకున్నాడు.