Mayank Yadav: ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్తో తలపడిన మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది. తన చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయి డీలా పడ్డ ముంబై ఇండియన్స్కు ఈ గెలుపు ఊపిరిపోసినట్టయింది.
ముల్లాన్పూర్ స్టేడియంలో గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలల్లో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్. 53 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు బుల్లెట్ల వంటి ఫోర్లతో 78 పరుగులు బాదాడు.

ఓపెనర్ రోహిత్ శర్మ- 36, మిడిలార్డర్లో తిలక్ వర్మ- 34 పరుగులతో సత్తా చాటారు. ఈ ముగ్గురి విజృంభణకు ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్.. అసమాన పోరాట పటిమను ప్రదర్శించింది. 14 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయిన దశ నుంచి 183 పరుగులు చేయగలిగిందంటే ఏ స్థాయిలో ప్రతిఘటించిందో అర్థం చేసుకోవచ్చు.
లోయర్ ఆర్డర్ బ్యాటర్ అశుతోష్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడీ మ్యాచ్లో. ముంబై బౌలర్లను బెంబేలెత్తించాడు తన భారీ షాట్లతో. 28 బంతులను ఎదుర్కొన్న అశుతోష్ ఇన్నింగ్లో ఏకంగా ఏడు భారీ సిక్సర్లు నమోదయ్యాయి. 28 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఒకదశలో పంజాబ్ కింగ్స్ గెలిచేలా కనిపించింది.
అశుతోష్ శర్మతో పాటు శశాంక్ సింగ్ సైతం దుమ్ము దులిపాడు. 25 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 41 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్కకు ఇది రెండో సీజన్ మాత్రమే. ఈ సీజన్లో ఇప్పటివరకు శశాంక్ సింగ్ ఏడు మ్యాచ్లల్లో 187 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 61.
అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ ఇద్దరూ అన్క్యాప్డ్ ప్లేయర్లే. ఇప్పుడు వారిద్దరే ఆదుకుంటున్నారు జట్టును. ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్ల హవా నడుస్తోన్నట్టే కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్లో మయాంక్ యాదవ్.. బౌలింగ్ సత్తా ఏమిటో ఇప్పటికే చూశాం. తన మొదటి రెండు మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్గా ఆడుతున్న అభిషేక్ శర్మ సైతం అన్ క్యాప్డ్ ప్లేయరే. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శివమ్ దూబే కంటే అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ఎక్కువ. రాజస్థాన్ రాయల్స్లో రియాన్ పరాగ్, కోల్కత నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా తమ సత్తా చాటుతున్నారు ఈ సీజన్లో.