జట్టు నిండా స్టార్ ప్లేయర్లే. ప్రతి సీజన్లో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంటుంది. ఏ ఫ్రాంచైజీకి లేనంతగా లాయల్ ఫ్యాన్స్ సొంతం. ఈ సాలా కప్ నమదే అంటూ ఏటా కొత్త ఉత్సాహంతో వస్తుంటుంది. కానీ రిజల్ట్ మాత్రం శూన్యం. 16 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇదంతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించి అని!
చరిత్ర కొనసాగింపుగా ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్క విజయమే సాధించింది. ఈ సీజన్లో తక్కువ స్కోరుకు ఆలౌటైన ఏకైక జట్టుగా,హోమ్ గ్రౌండ్లో రెండు ఓటములు చవిచూసిన టీమ్గా బెంగళూరు ఇప్పటికే చెత్త రికార్డు నెలకొల్పింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆర్సీబీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు ట్రోఫీ సాధించకపోవడానికి గల కారణాలను వివరించాడు. ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఫ్లాప్ అవ్వుతూ జూనియర్ క్రికెటర్లపై భారాన్ని పెంచడమే ఆర్సీబీ ఓటములకు ప్రధాన కారణమని రాయుడు అభిప్రాయపడ్డాడు. సీనియర్లంతా టాప్ ఆర్డర్లో ఉంటారని, లోయర్ ఆర్డర్లో ఉండేది జూనియర్లే అని అన్నాడు. అలాగే పేలవమైన బౌలింగ్ మరో కారణమని తెలిపాడు.
''ఆర్సీబీ బౌలర్లు ఎప్పుడూ ధారాళంగా పరుగులు సమర్పిస్తుంటారు. మరోవైపు బెంగళూరు బ్యాటర్లు మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయరు. ముఖ్యంగా అంతర్జాతీయ ఆటగాళ్లు. ఒత్తిడి సమయంలో వాళ్లంతా బ్యాట్లెత్తుస్తుంటారు. అప్పుడు భారాన్ని మోసేది భారత యువ బ్యాటర్లే. గత 16 సీజన్లలో ఇదే రిపీట్ అవుతుంది''
''కీలక సమయాల్లో స్టార్ ఆటగాళ్లు తడబడుతూ ఉంటారు. అంతేగాక ప్రధాన ఆటగాళ్లంతా టాప్ ఆర్డర్లోనే ఉంటారు. మిడిల్, లోయర్ ఆర్డర్లో జూనియర్లే ఉంటారు. దీంతో క్లిష్టపరిస్థితుల్లో అనుభవజ్ఞులు ఉండట్లేదు'' అని అంబటి రాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లి, డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, మాక్స్వెల్ టాప్-4లో బ్యాటింగ్కు వస్తుంటారు. దినేశ్ కార్తీక్ ఫినిషర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.