రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా తలుపు తట్టాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే రెండు ఇన్నింగ్స్లోనూ అర్ధశతకాలతో సత్తాచాటాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్కు ఈ ఏడాది ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కలేదు. పేస్, స్పిన్ను దూకుడుగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించే సామర్థ్యం ఉన్న సర్ఫరాజ్ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
గతేడాది డిసెంబర్లో దుబాయ్ వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. వేలానికి ముందు సర్ఫరాజ్ ఖాన్ను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకుంది. ఆ తర్వాత ఏ ఫ్రాంచైజీ అతడిపై ఆసక్తి చూపకపోవడంతో వేలానికి ప్రకటించిన షార్ట్ లిస్ట్లో కూడా సర్ఫరాజ్ ఎంపిక కాలేదు. అయితే ఆ సమయంలో సర్ఫరాజ్ను వదులుకోవడానికి గల కారణాలను ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వివరించాడు.

టెస్టు ఫార్మాట్కు సర్ఫరాజ్ చక్కగా సరిపోతాడని, భిన్నమైన టీ20 ఫార్మాట్లో ఉన్న అంచనాల కారణంగా అతడిని వదులుకున్నామని గంగూలీ వివరించాడు. ''సర్ఫరాజ్ సమర్థవంతమైన అయిదు రోజు ఫార్మాట్ ప్లేయర్. అతని ఆట ఆ ఫార్మాట్కు మంచిగా సరిపోతుంది. కానీ టీ20 భిన్నమైన ఫార్మాట్. రంజీ ట్రోఫీలో సాధించిన పరుగులు, ఇతర ఫస్ట్ క్లాస్ గేమ్స్లో అతడి ప్రదర్శన అద్భుతం. అందరూ అన్నట్లుగా సాధించిన పరుగులు వృథా కావని నిరూపిస్తూ అతడు భారత జట్టులోకి వచ్చాడు'' అని దాదా పేర్కొన్నాడు.
అయితే టీమిండియాలో అడుగుపెట్టిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకురావడానికి దారులు వెతుకుతున్నాయి. అందరిలో కోల్కతా ఫ్రాంచైజీ సర్ఫరాజ్పై ఎక్కువ ఆసక్తితో ఉంది. అతడి రాకతో జట్టు సమతూకంగా మారుతుందని కోల్కతా మెంటార్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది.