ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా డిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో నెగ్గి పాయింట్ల ఖాతా తెరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ సమష్టిగా పోరాడి 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో, 6x4, 3x6) టాప్ స్కోరర్.
ఇషాన్ కిషన్ (42; 23 బంతుల్లో, 4x4, 2x6), టిమ్ డేవిడ్ (45*; 21 బంతుల్లో, 2x4, 4x6) సత్తాచాటారు. ఆఖర్లో షెఫార్డ్ (39*; 10 బంతుల్లో, 3x4, 4x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (71*; 25 బంతుల్లో, 3x4, 7x6) గొప్పగా పోరాడాడు. పృథ్వీ షా (66; 40 బంతుల్లో, 3x4, 4x6), అభిషేక్ పోరెల్ (41; 31 బంతుల్లో, 5x4) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా (2/22), కొయెట్జీ (4/34) ఆకట్టుకున్నారు.

అనంతరం రోహిత్ శర్మ జట్టు ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడాడు. సమష్టిగా పోరాడితే భారీ స్కోరులు సాధించవచ్చని, కెప్టెన్ హార్దిక్, కోచ్ బౌచర్ ఇదే ఆశిస్తున్నారని రోహిత్ అన్నాడు. ముంబై కెప్టెన్సీ మార్పు తర్వాత హార్దిక్ గురించి రోహిత్ ప్రస్తావించడం ఇదే ప్రథమం. రోహిత్ను కాదని, హార్దిక్కు జట్టు పగ్గాలు అందించిన విషయం తెలిసిందే.
''జట్టు గొప్పగా బ్యాటింగ్ చేసింది. తొలి మ్యాచ్ నుంచి మనం విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ ఓ విషయాన్ని నిరూపించాం. వ్యక్తిగత ప్రదర్శలను పట్టించుకోకుండా అందరూ ముందుకు వచ్చి గొప్పగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చని చాటిచెప్పాం. గత కొంత కాలంగా మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం. బ్యాటింగ్ కోచ్ పొలార్డ్, కోచ్ బౌచర్, కెప్టెన్ హార్దిక్ ఇలాంటి ప్రదర్శననే కోరుకుంటున్నారు'' అని రోహిత్ తెలిపాడు.