మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జట్ల బలబలాల గురించి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చర్చలు మొదలుపెట్టారు. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్ మార్చి 22న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్ బెంగూరు తలపడనుంది.
అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో దశ మ్యాచ్లు ఢిల్లీ వేదికగా జరగనుండటంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోమ్ గ్రౌండ్ను వైజాగ్గా మార్చుకుంది. వైజాగ్ వేదికగా సీఎస్కే, కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ముగిసిన అనంతరం తిరిగి ఢిల్లీలో మ్యాచ్లు ఆడుతుంది.

కాగా, ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిన ఢిల్లీ క్యాపిటల్స్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడాడు. ఢిల్లీ బలహీనతల గురించి తన అభిప్రాయాలను వివరించాడు. ఢిల్లీకి ప్రధాన సమస్య మూడో స్పిన్నర్ అని పేర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్తో ఎనిమిది ఓవర్లు పాటు ఢిల్లీకి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ మూడో స్పిన్నర్తోనే అసలు సమస్య మొదలవుతుందని అన్నాడు.
''ఢిల్లీ జట్టులో మూడో స్పిన్నర్ ఆప్షన్ బలహీనంగా ఉంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్తో ఎనిమిది ఓవర్లు కట్టుదిట్టంగా ఉంటాయి. అంతేగాక వీరిద్దరు కొత్తబంతితో బౌలింగ్ చేయగలరు, వికెట్లు సాధించగలరు. కానీ మరో స్పిన్నర్ను ఎంచుకోవడం కాస్త ఆందోళనగా ఉంది. కొన్నిసార్లు లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబెను అదనపు స్పిన్నర్గా జట్టులోకి తీసుకువస్తున్నారు. ఆ జట్టుకు మూడో స్పిన్నర్ సమస్య ఉంది'' అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.
కాగా, గాయంతో దూరమైన పంత్ ఈ సీజన్లో తిరిగొస్తున్నాడు. పంత్ రాక ఢిల్లీ క్యాపిటల్స్కు బలోపేతంగా మారనుంది. పంత్ గైర్హాజరీలో సారథి బాధ్యతలు అందుకున్న డేవిడ్ వార్నర్ జట్టును గొప్పగా నడిపించలేకపోయాడు. ఐపీఎల్-2023 పాయింట్ల పట్టికలో ఢిల్లీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఒస్త్వాల్, అన్రిచ్ నోర్జె, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ , ముకేశ్ కుమార్, హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిక్ దార్, రిచర్డ్సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షై హోప్.