ఐపీఎల్-2024: సీజన్ ప్రారంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ హేటర్స్ను నిరాశపరచలేదు. ఎప్పటిలానే బ్యాటింగ్లో హిట్టూ.. బౌలింగ్లో ఫట్టూ అన్నట్లుగా పోరాడింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఓటమితో 17వ సీజన్ను ఆరంభించింది.
78 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచిన ఆర్సీబీని అనుజ్ రావత్ (48; 25 బంతుల్లో), దినేశ్ కార్తీక్ (38*; 26 బంతుల్లో) ఆదుకున్నారు. వారిద్దరి పోరాటంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (35; 23 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. ముస్తాఫిజుర్ (4/29) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.

అనంతరం ఛేదనలో చెన్నై 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర (37; 15 బంతుల్లో) దూకుడుతో పవర్ప్లేలో సీఎస్కే 62 పరుగులు చేసింది. కానీ స్వల్పవ్యవధిలోనే వికెట్లు కోల్పోవడం, శివమ్ దూబె (34*; 28 బంతుల్లో) తొలుత నిదానంగా ఆడటంతో మ్యాచ్ ఆర్సీబీ వైపుకు మళ్లింది. కానీ దూబె గేర్ మార్చి జడేజా (25; 17 బంతుల్లో)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అయితే ఆర్సీబీ ఓటమిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పేలవమైన వ్యూహాలతో బెంగళూరు ఓటమిపాలైందని గవాస్కర్ అన్నాడు. కేవలం బౌన్సర్లతోనే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాలనుకోవడం చెత్త నిర్ణయమని అన్నాడు. గావస్కర్ మాటలతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఏకీభవించాడు.
''షార్ట్ బాల్స్ వ్యూహాన్ని ఎంచుకున్నారు. కానీ అది ఫలించలేదు. కానీ అందరూ దాన్నే కొనసాగించాలనుకున్నారు. మయాంక్ దాగర్ రెండు ఓవర్లు వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. అతడు ఎడమచేతి వాటం స్పిన్నర్ అని మీరు సందేహించి ఉండవచ్చు. కానీ అతనికి మరో అవకాశం ఇవ్వాల్సింది. జోసెఫ్, గ్రీన్, సిరాజ్ అందరూ షార్ట్ బాల్స్కు ట్రై చేశారు''
''బౌన్సర్ను సరిగా సంధించకపోతే అది వైడ్ అవుతుంది, ఎక్స్ట్రా రన్తో పాటు ఎక్స్ట్రా బాల్ వేయాల్సి వస్తుంది. అందుకే బౌన్సర్లు కచ్చితత్వంతో వేయాలి. కానీ అది సాధ్యం కాలేదు. ఇలా వన్ డైమన్షన్ వ్యూహాలు తీవ్రంగా నిరాశపరిచాయి'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే ఆర్సీబీ చేసిన తొలి తప్పు అని పీటర్సన్ అన్నాడు. బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.