రోహిత్ శర్మ అభిమానులు చూపిస్తున్న భావోద్వేగాన్ని చూసి విదేశీ మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. అహ్మబాదాద్ స్టేడియంలో రోహిత్కు బ్రహ్మరథం పట్టడం, హార్దిక్ పాండ్యను అవమానించడం చూసి షాక్ అయ్యారు. ఐపీఎల్ ముగిసే వరకు హార్దిక్కు ఇదే పరిస్థితి ఎదురవుతుందేమోనని మాజీ ఆటగాళ్లు బ్రియాన్ లారా, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బిషప్ భావిస్తున్నారు.
అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ను కాదని హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రోహిత్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. నెటింట్లో, బయటా హార్దిక్ను లక్ష్యంగా చేసుకుని దారుణంగా విమర్శిస్తున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ముంబై యాజమాన్యం వివరించినా హిట్ మ్యాన్ ఫ్యాన్స్ హార్దిక్ను వదిలిపెట్టట్లేదు.

తాజాగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లోనూ హార్దిక్ను విపరీతంగా ట్రోల్ చేశారు. టాస్ కోసం హార్దిక్ పాండ్య వచ్చినప్పుడు 'రోహిత్ రోహిత్' అంటూ నినాదాలు చేశారు. రోహిత్ పేరుతో స్టేడియం మార్మోగింది. దీన్ని చూసి వ్యాఖ్యాతలు వ్యవహరిస్తున్న మాజీ ఆటగాళ్లు షాకయ్యారు. రోహిత్-హార్దిక్ గురించి మాట్లాడుకున్నారు.
'ఓ భారత క్రికెటర్ ఇంతలా హేళనకు గురికావడం నేనెప్పుడూ చూడలేదు. అహ్మదాబాద్లో హార్దిక్ పాండ్యను ప్రేక్షకులు హేళన చేస్తున్నారు. ఇలా జరగడం చాలా అరుదు' అని కెవిన్ పీటర్సన్ అన్నాడు.
దానికి ఇయాన్ బిషప్ స్పందిస్తూ.. 'వాళ్ల మనస్సులు హార్దిక్ తిరిగి గెలుచుకోవాలంటే ఏం చేయాలి?' అని అన్నాడు.
ఈ విషయంపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా బదులిచ్చాడు. రోహిత్ ఫ్యాన్స్ నుంచి తప్పించుకోవాలంటే హార్దిక్కు టీమిండియా జెర్సీనే మార్గమని అన్నాడు. 'హార్దిక్ భారత్ కోసం ఆడాలి. అప్పుడే ఇక్కడ పరిస్థితి చక్కబడుతుంది' అని లారా అన్నాడు. లారా ఆలోచనతో పీటర్సన్, ఇయాన్ ఏకీభవించారు.
కాగా, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభ్మన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు.