ఈడెన్ గార్డెన్స్లో శనివారం సిక్సర్ల వర్షం కురిసింది. రసెల్, హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్లో అభిమానులు ఊపిరిబిగపట్టారు. అంతిమంగా సన్రైజర్స్ హైదరాబాద్పై కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. రసెల్ (64; 25 బంతుల్లో) మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. సాల్ట్ (54; 40 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. రింకూ సింగ్ (23; 15 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. అయితే ఓ దశలో కోల్కతా 14 ఓవర్లకు 119/6 స్కోరు మాత్రమే సాధించింది. కానీ ఆ తర్వాత రసెల్ తన ఊచకోతతో ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు.

అనంతరం ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (63; 29 బంతుల్లో) గొప్ప పోరాటం వృథాగా మారింది. క్లాసెన్ ఎనిమిది సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లో ఎస్ఆర్హెచ్కు 13 పరుగులు అవసరమవ్వగా హర్షత్ రాణా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని క్లాసెన్ సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత సింగిల్ తీశాడు. స్ట్రైకింగ్కు వచ్చిన షాబాజ్ అహ్మద్ (16; 5 బంతుల్లో) మూడో బంతిని భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. నాలుగో బాల్కు జేన్సన్ సింగిల్ తీశాడు.
దీంతో హైదరాబాద్ విజయానికి ఆఖరి రెండు బంతుల్లో అయిదు పరుగులు అవసరమయ్యాయి. అయినప్పటికీ క్లాసెన్ క్రీజులో ఉండటంతో సన్రైజర్స్ అభిమానులు ధీమాగానే ఉన్నారు. అయిదో బంతిని క్లాసెన్ భారీ షాట్కు యత్నించాడు. కానీ అది ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. షార్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్న సుయాశ్ శ ర్మ వెనక్కి పరిగెత్తుతూ గాల్లో దూకి కళ్లుచెదిరేలా క్యాచ్ అందుకున్నాడు. ఇది మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ఆ కష్టతరమైన క్యాచ్ను సుయాశ్ జారవిడిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సుయాశ్ గేమ్ ఛేంజర్ అని కొనియాడుతున్నారు.