మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మెగా లీగ్లో బరిలోకి దిగే పది జట్లూ టైటిల్ ఫేవరేట్లే. ప్రతి టీమ్లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ప్రమాదకర బౌలర్లు, భీకర హిట్టింగ్ చేసే బ్యాటర్లకు ఎక్కడా కొదవ లేదు. ఎప్పటిలానే ఎన్నో అంచనాలు, ఆశల మధ్యలో మరోసారి కప్ను ముద్దాడాలని సన్రైజర్స్ హైదరాబాద్ అడుగుపెడుతుంది.
అయితే ఈ సారి సన్రైజర్స్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా బరిలోకి దిగుతుంది. లోపాలను అధిగమించేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించి ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన వేలంలో స్టార్ ప్లేయర్ల కోసం ఎస్ఆర్హెచ్ రూ.కోట్లు కుమ్మరించింది. కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకుంది. కానీ హైదరాబాద్ జట్టుకు ఓ సమస్య వెంటాడుతోంది.

జట్టులో మ్యాచ్ విన్నర్లను ఎక్కువగా ఉంచుకుంది. అయితే వాళ్లందరూ విదేశీ ప్లేయర్లే కావడం అసలు సమస్య. ఐపీఎల్ నిబంధనల ప్రకారం నలుగురు విదేశీ ప్లేయర్లకే జట్టులో అవకాశం ఉంటుంది. కానీ సన్రైజర్స్ టీమ్లో హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జేన్సన్, గ్లెన్ ఫిలిప్స్, ఫరూకీ, ట్రేవిస్ హెడ్, హసరంగ, ప్యాట్ కమిన్స్ వంటి ఫారెన్ స్టార్లు ఉన్నారు.
వాళ్లందరిలో నలుగురిని తుదిజట్టులో ఎంచుకోవాలంటే పెద్ద తలనొప్పే. ఇటీవల జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమిన్స్ (రూ.20.50 కోట్లు), ట్రేవిస్ హెడ్ (రూ.6.80 కోట్లు), శ్రీలంక ఆల్రౌండర్ హసరంగ (రూ.1.50 కోట్లు)ను భారీ ఖర్చు చేసింది. కానీ జట్టు కూర్పు గురించి యాజమాన్యం ఆలోచించలేదు. భారత ఆటగాళ్లలో భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్ మినహా నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరూ లేరు. దీంతో తుదిజట్టు కూర్పు ప్రధాన సవాలుగా ఉండనుంది.
అయితే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో కాస్త ఊరట దక్కినప్పటికీ విదేశీ మ్యాచ్ విన్నర్లు అందరినీ తుది జట్టులో కొనసాగించలేని పరిస్థితి ఎదురవుతుంది. ప్రత్యర్థిని, ఆడే మైదానాన్ని బట్టి మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న నలుగురు విదేశీ ఆటగాళ్లను తుదిజట్టులో ఉంచగలిగితే ఎస్ఆర్హెచ్కు ఎదురుండదు.
సన్రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ట్రేడ్), అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్విర్సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.