అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఆరు పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ 17వ సీజన్ను ఘనంగా బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభ్మన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు.
అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు. గుజరాత్ బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. అజ్మతుల్లా, ఉమేశ్ యాదవ్, జాన్సన్, మోహిత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.

బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైను ఛేదనలో కట్టడి చేసి గుజరాత్ కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫుల్ మార్కులు కొట్టేశాడు. మరోవైపు గుజరాత్ మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ పరంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కొత్త బంతిని బుమ్రాకు అందించంకుండా తానే మొదట బౌలింగ్ చేసిన హార్దిక్ తీరుపై అభిమానులతో సహా మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.
టాస్ గెలిచిన హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవర్ హార్దిక్యే బౌలింగ్ చేశాడు. 11 పరుగులు సమర్పించుకున్నాడు. మూడో ఓవర్ కూడా మళ్లీ అతడే వేశాడు. ఈసారి 9 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత బుమ్రాకు బౌలింగ్ ఇచ్చాడు. నాలుగో ఓవర్ వేసిన బుమ్రా కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లతో సత్తాచాటాడు.
ఈ విషయంలో హార్దిక్ కెప్టెన్సీ తీరుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అసహనం వ్యక్తం చేశాడు. 'బుమ్రాతో బౌలింగ్ ఎందుకు ఆరంభించలేదు? నాకేం అర్థం కావట్లేదు' అని పీటర్సన్ అన్నాడు. పీటర్సన్ వ్యాఖ్యలతో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఏకీభవించాడు. 'అవును, నువ్వు అడిగిన ప్రశ్న చాలా చాలా మంచిది' అని గవాస్కర్ కామెంటరీలో రిప్లై ఇచ్చాడు. మరోవైపు హార్దిక్ది చెత్త కెప్టెన్సీ అని నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి.