ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న తర్వాత హార్దిక్ పాండ్యకు ఏదీ కలిసి రావట్లేదు. జట్టులో, బయటా హార్దిక్పై ప్రతికూలత వాతావరణం నెలకొంది. రోహిత్ మద్దతుదారులు హేళన చేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వడం ఈ స్టార్ ఆల్రౌండర్పై ఒత్తిడి మరింత పెంచింది.
అయితే విజయాలు పక్కనపెడితే కెప్టెన్గా ఎవరూ కోరుకోని రికార్డును తన పేరిట హార్దిక్ మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థి జట్టుకి అత్యధిక స్కోరు ఇచ్చిన సారథిగా చెత్త రికార్డు నమోదుచేశాడు. ఉప్పల్ వేదికగా నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఈ పేలవమైన రికార్డు నమోదైంది.

అంతేగాక హార్దిక్ కెప్టెన్సీ వ్యూహాలపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. బుమ్రాకు మరోసారి ఆలస్యం బంతిని అందించి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు సైతం విమర్శిస్తున్నారు. మరోవైపు బ్యాటింగ్లోనూ హార్దిక్ నిరాశపరిచాడు. 20 బంతుల్లో 24 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యపై నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. 'అత్యధిక పరుగులు ఇచ్చిన కెప్టెన్గా ఉండటం సంతోషమే. ప్రత్యేకంగా ఉన్నా' అంటూ హార్దిక్పై మీమ్స్ వస్తున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో) మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో) కొనసాగించాడు. మార్క్రమ్ (42*; 28 బంతుల్లో)తో కలిసి క్లాసెన్ (80*; 34 బంతుల్లో) ఊచకోతతో ఇన్నింగ్స్ ముగించాడు.
అనంతరం ఛేదనలో ముంబై అసాధారణ పోరాటం చేసింది. 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ మ్యాచ్లో 38 సిక్సర్లు నమోదయ్యాయి.