MS Dhoni: ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై. మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలకు తెర తీసింది ఈ ఓటమి. అతను బ్యాటింగ్ వచ్చిన పరిస్థితులు సైతం దీనికి కారణం అయ్యాయి.
శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో పరాజయం పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. అజింక్య రహానె- 35, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా- 31 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఈ టార్గెట్ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇంకా 11 బంతులు మిగిలివుండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది.
ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. 20వ ఓవర్ మూడో బంతికి డారిల్ మిఛెల్ అవుటైన తరువాత ధోనీ క్రీజ్లోకి వచ్చాడు. రెండు బంతులను ఎదుర్కొని, ఒక్క పరుగే చేయగలిగాడు. నాటౌట్గా నిలిచాడు. చివరి మూడు బంతులు మిగిలి ఉన్న సమయంలో అతను బ్యాటింగ్కు రావడం చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ మైఖేల్ వాన్ ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. మూడు బంతులే మిగిలే ఉన్న సమయంలో ధోనీ బ్యాటింగ్కు ఎందుకు వచ్చాడో తనకు అర్థం కావట్లేదని పేర్కొన్నాడు. ఢిల్లీ కేపిటల్స్పై జరిగిన మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్లో ముందే వచ్చాడని, 16 బంతుల్లో ధోనీ 37 పరుగులు చేశాడని గుర్తు చేశాడు.
అదే వ్యూహాన్ని సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఎందుకు అనుసరించలేదో తెలియట్లేదని మైఖేల్ వాన్ అన్నాడు. న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ సైమన్ డౌల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్లోయర్ డెలివరీలను హార్డ్ హిట్ చేయగల సత్తా ధోనీకి ఉందని, ఇదివరకటి మ్యాచ్లల్లో అది ప్రూవ్ అయిందని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాకపోవడం ఆశ్చర్యమేనని పేర్కొన్నాడు.