SRH vs CSK: ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది సన్రైజర్స్కు. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన మూడింట్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. రెండింట్లో ఓడింది. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులోనూ ఓడిందంటే మున్ముందు టోర్నమెంట్లో ముందడుగు వేయడానికి చెమటోడ్చాల్సి ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దీనికి భిన్నం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లల్లో రెండింట్లో గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ మంచి రన్రేట్తో నెగ్గగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ పోరును ప్రత్యక్షంగా తిలకించడానికి వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు. వారి సౌకర్యం కోసం టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేకంగా 60 సిటీబస్సులను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ జోన్ అధికారులు విడుదల చేశారు.
మెహదీపట్నం, ఘట్కేసర్, హయత్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోఠీ, అఫ్జల్గంజ్, లక్డీకాపుల్, దిల్షుక్నగర్, జీడిమెట్ల, కేపీహెచ్బీ, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, హకీంపేట్, ఈసీఐఎల్, బోయిన్పల్లి, చార్మినార్, చాంద్రాయన్గుట్ట, కొండాపూర్, బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ స్టేడియానికి సాయంత్రం 6 నుంచి రాత్రి 11:30 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి.
ఈ బస్సులను ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత వాహనాల్లో వెళ్లడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, దీనికి కారణం కావొద్దని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని కోరారు.
సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని సజ్జనార్ చెప్పారు. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించడానికి స్టేడియానికి వెళ్లే అభిమానుల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను నడుపిస్తోన్నామని అన్నారు.
ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమౌతాయని, తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి నిర్దేశిత గమ్యస్థానాలకు బయలుదేరుతాయని సజ్జనార్ తెలిపారు. ఈ సిటీ బస్సులను ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి మ్యాచ్ వీక్షించాలని, ట్రాఫిక్ రద్దీకి కారణం కావొద్దని అకాంక్షిస్తున్నట్లు చెప్పారు.