MS Dhoni: ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో మట్టికరిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. సన్రైజర్స్ హైదరాబాద్ ఈ టార్గెట్ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.
ఇంకా 11 బంతులు మిగిలివుండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు- విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది.

చెన్నై టీమ్లో శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. చెన్నై ఓడినప్పటికీ అతని బ్యాటింగ్ ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లల్లో 148 పరుగులు చేశాడు దుబే. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. 160.87 స్ట్రైక్ రేట్తో అతని బ్యాటింగ్ సాగుతోంది.
తొలి మ్యాచ్లో 34, రెండో మ్యాచ్లో 51, మూడో మ్యాచ్లో 18 పరుగులు చేశాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇప్పటివరకు 541 బంతులను ఎదుర్కొన్న 61 సిక్సర్లు, 43 బౌండరీలు బాదాడు. ఇది ఇప్పట్లో ఆగేది కూడా కాదు. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి ఈ సిక్సర్లు, ఫోర్ల సంఖ్యలో భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది అతని దూకుడు చూస్తోంటే.

శివం దుబే బ్యాటింగ్ ఫామ్పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. టీ20 ఫార్మట్కు తగ్గట్టుగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. క్లీన్ షాట్స్ పడుతున్నాయని ప్రశంసించాడు. అతని బ్యాటింగ్ చూడటానికి ఎగ్జైటింగ్గా ఉంటోందని వ్యాఖ్యానించాడు.
ఈ ఏడాది జరిగబోయే టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోయే భారత జట్టులో శివం దుబేకు చోటు దక్కితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అతనొక గేమ్ ఛేంజర్ అవుతాడని పేర్కొన్నాడు. ఆటను సమూలంగా మార్చగల శక్తి సామర్థ్యాలు అతనిలో ఉన్నాయని యువరాజ్ సింగ్ ప్రశంసించాడు.