SRH vs CSK: ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బంతితో, అనంతరం బ్యాట్తో చెలరేగింది. ఆల్రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. బలమైన సూపర్ కింగ్స్ టీమ్ను అలవోకగా ఓడించింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడీ ఇంపాక్ట్ ప్లేయర్. అజింక్య రహానె- 35, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా- 31 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఈ టార్గెట్ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇంకా 11 బంతులు మిగిలివుండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది.
పాట్ కమ్మిన్స్ బౌలర్గా, కేప్టెన్గా సత్తా చాటాడీ మ్యాచ్లో. శివం దుబే క్రీజ్లో ఉన్నంత సేపూ భారీ స్కోర్ సాధించేలా కనిపించిన చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుకు సకాలంలో కళ్లెం వేయగలిగాడు. ఎప్పటికప్పుడు బౌలర్లను మార్చుతూ బ్యాటర్లపై ఒత్తిడిని తీసుకుని రాగలిగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి కీలకమైన శివం దుబే వికెట్ పడగొట్టాడు.
రవీంద్ర జడేజా రనౌట్నూ కమ్మిన్స్ అప్పీల్ చేయకపోవడం అతని కేప్టెన్సీకి అద్దం పట్టింది. ఫలితంగా మహేంద్ర సింగ్ ధోనీ క్రీజ్లో రాకుండా అడ్డుకోగలిగినట్టయింది. రనౌట్ను అడ్డుకున్నాడనే కారణంతో అప్పీల్కు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని వదులుకున్నాడు పాట్ కమ్మిన్స్.
ఇన్నింగ్ 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భువనేశ్వర్ కుమార్ సంధించిన ఓవర్ అది. ఆ ఓవర్ నాలుగో బంతిని పిన్ పాయింట్ యార్కర్గా సంధించాడు భువి. దాన్ని లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు జడేజా. ఎడ్జ్ తీసుకున్న బంతి బౌలర్ వైపు దూసుకొచ్చింది. అప్పటికే రన్ తీయడానికి క్రీజ్ను దాటి బయటికి వచ్చిన జడేజా.. బంతి భువి చేతిలో ఉండటాన్ని చూసి, మళ్లీ వెనక్కి మళ్లాడు.
జడేజా క్రీజ్ బయట ఉండటంతో అతన్ని రనౌట్ చేయడానికి బంతిని వికెట్ల వైపు విసిరాడు భువి. అది కాస్త వెళ్లి జడేజా వీపు కింది భాగంలో తగిలింది. నిబంధనల ప్రకారం- రనౌట్ను అడ్డుకోవడానికి బ్యాటర్ ప్రయత్నించినప్పుడు అప్పీల్ చేసుకునే వెసలుబాటు ఉంది. పాట్ కమ్మిన్స్ మాత్రం అప్పీల్ చేయలేదు.
జడేజా అవుట్ అయితే ఆ తరువాత క్రీజ్లోకి వచ్చేది ధోనీ కావడం వల్లే అతను అప్పీల్కు వెళ్లలేదని క్రికెట్ పండితులు అంచనా. అసలే డెత్ ఓవర్లు కావడం, ఆ సమయంలో ధోనీ బ్యాటింగ్కు దిగితే భారీ షాట్లతో విరుచుకుపడొచ్చని భావించడం వల్లే కమ్మిన్స్ అప్పీల్ చేయలేదు. 19.3లో డారిల్ మిఛెల్ అవుటైన తరువాత ధోనీ బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఒక్క పరుగుకే పరిమితం అయ్యాడు.