ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తాచాటుతోంది. విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ టీ20ల్లో కొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. 250+ స్కోరు సాధించడం సాధారణమే అన్నట్లుగా క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఎస్ఆర్హెచ్ బాటలోనే లీగ్లోని ఇతర జట్లు పయనిస్తూ బౌలర్లుకు నిద్రలేకుండా చేస్తున్నారు.
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు రికార్డును ఏకంగా రెండు సార్లు బద్దలుకొట్టింది. ఆర్సీబీ 263 రికార్డును బ్రేక్ చేస్తూ హైదరాబాద్ 277/3, 287/3 స్కోరు సాధించింది. అంతేగాక పది ఓవర్లలో అత్యధిక స్కోరు సాధించిన ఘనత ఎస్ఆర్హెచ్దే.

ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు సృష్టించిన విధ్వంసాన్నిఅభిమానులు అంత సులువగా మరిచిపోలేరు. 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే ఛేదించింది. టీ20 చరిత్రలో 150+ స్కోరును బంతుల పరంగా అత్యంత వేగంగా సాధించిన జట్టు సన్రైజర్సే. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ (89*; 30 బంతుల్లో, 8x4, 8x6), అభిషేక్ శర్మ (75*; 28 బంతుల్లో, 8x4, 6x6) చెలరేగారు. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ నెట్రన్రేట్తో పాటు ప్లేఆఫ్స్ అవకాశాలు గణనీయంగా మెరుగు పర్చుకుంది.
ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఏడు విజయాలు సాధించింది. 14 పాయింట్లతో టాప్-3లో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమే. అయితే ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్ను వచ్చే గురువారం ఆడనుంది. సొంతమైదానంలో గుజరాత్ టైటాన్స్తో మే 16వ తేదీన తలపడనుంది.
దీంతో సన్రైజర్స్ ఆటగాళ్లకు వారం రోజుల సుదీర్ఘ విరామం దొరికింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు విహారయాత్రలకు వెళ్లారు. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ దుబాయ్కు చేరుకున్నారు. అక్కడ గోల్ఫ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. హెన్రిచ్ క్లాసెన్ తన కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ స్టార్ ప్లేయర్లంతా మే 14న తిరిగి భారత్కు చేరుకోనున్నారు. సన్రైజర్స్ గుజరాత్తో మే 16న, పంజాబ్ కింగ్స్తో మే 19న ఆడనుంది.