ఉప్పల్లో పరుగుల వరద పారింది. స్టేడియంలో సిక్సర్ల వర్షానికి ప్రేక్షకులు తడిసిముద్దయ్యారు. గత ఐపీఎల్ రికార్డులు బద్దలయ్యాయి. టీమ్ అత్యధిక స్కోరు, ఛేదనలో అత్యధిక స్కోరు, అత్యధిక సిక్సర్లు.. ఇలా చరిత్ర తిరగరాశారు. ఈ అరుదైన ఘనతలకు సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రతీకగా నిలిచింది.
523 పరుగులు నమోదైన ఈ మ్యాచ్లో అంతిమంగా ముంబైపై హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అయితే నెట్టింట్లో ఆర్సీబీపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ట్రోఫీని సాధించలేకపోయినా ఆర్సీబీ అభిమానులు గొప్పగా చెప్పుకునే ఏకైక అత్యధిక స్కోరు రికార్డు కూడా ఇప్పుడు బ్రేక్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2013లో పుణె వారియర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263 పరుగులు చేసింది. గిల్ 66 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేశాడు. ఈ ఆర్సీబీ రికార్డు 11 ఏళ్ల తర్వాత నిన్న బద్దలైంది.

దీంతో ఇతర జట్ల అభిమానుల ఆర్సీబీపై వ్యంగ్యంగా పోస్ట్లు పెడుతున్నారు. ఇక ఆర్సీబీకి ఉన్న రికార్డు అత్యల్ప స్కోరు మాత్రమే అని కామెంట్లు చేస్తున్నారు. 2017లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు ఇదే.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో) మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో) కొనసాగించాడు. మార్క్రమ్ (42*; 28 బంతుల్లో)తో కలిసి క్లాసెన్ (80*; 34 బంతుల్లో) ఊచకోతతో ఇన్నింగ్స్ ముగించాడు.
అనంతరం ఛేదనలో ముంబై అసాధారణ పోరాటం చేసింది. 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ మ్యాచ్లో 38 సిక్సర్లు నమోదయ్యాయి.