సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఎస్ఆర్హెచ్ నయా ఆల్రౌండర్ వానిందు హసరంగ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఎడమ మడమ గాయం కారణంగా ఐపీఎల్-2024 నుంచి తప్పుకున్నాడు. ఇది హైదరాబాద్ జట్టుకు తీవ్ర ప్రతికూలమైన విషయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సీజన్ సగం గడిచిన తర్వాత స్లో పిచ్లపై హసరంగ బ్యాటర్లకు ప్రమాదకరంగా మారతాడని, అలాంటి మ్యాచ్ విన్నర్ దూరమవ్వడం సన్రైజర్స్కు ఎదురుదెబ్బే అని అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమై వారం గడిచినా హసరంగ ఇంకా జట్టుతో చేరలేదు. ఇప్పటికే రెండు మ్యాచ్లకు దూరమైన హసరంగ మరికొన్ని మ్యాచ్లకు కూడా దూరమవుతాడని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా లీగ్ మొత్తానికే అతడు అందుబాటులో ఉండట్లేదని అధికారికంగా ప్రకటించారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకున్న హసరంగను వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ.1.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ విన్నర్ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. కానీ, ఇటీవల బంగ్లాదేశ్ జరిగిన వన్డే సిరీస్లో హసరంగ గాయపడ్డాడు. దీంతో అతడు శ్రీలంక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో హసరంగ గాయం గురించి లంక బోర్డు జాగ్రత్త వహిస్తుంది. అందుకే అతడికి ఐపీఎల్లో ఆడటానికి అనుమతి లభించలేదని తెలుస్తోంది.
ఐపీఎల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్లు ఆడిన హసరంగ 35 వికెట్లు పడగొట్టాడు. కాగా, హసరంగ స్థానాన్ని మరో స్పెషలిస్ట్ స్పిన్నర్తో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భర్తీచేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే స్పిన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతనికి తోడుగా షాబాజ్ అహ్మద్ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. మార్కండే, షాబాజ్తో పాటు జట్టులో వాష్టింగ్టన్ సుందర్ కూడా సమర్థవంతంగా స్పిన్ బౌలింగ్ చేయగలడు.
SRH పూర్తి జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్విర్సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.