సీజన్లు మారినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ మారట్లేదు. ఎప్పటిలానే విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం, మిగిలిన ప్లేయర్లు బ్యాట్లెత్తేయడం వంటి ఆర్సీబీ సాధారణ విషయాలు.. ఈ సీజన్లోనూ జరుగుతున్నాయి. జైపుర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయిదు మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113*; 72 బంతుల్లో, 12x4, 4x6) అజేయ సెంచరీ సాధించాడు. మరోసారి జట్టును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బట్లర్ (100*; 58 బంతుల్లో, 9x4, 4x6) శతకంతో సత్తాచాటాడు. సిక్సర్తో జట్టును గెలిపించి సెంచరీని అందుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (69; 42 బంతుల్లో, 8x4, 2x6) అర్ధశతకంతో అలరించాడు.

కాగా, ఆర్సీబీ ఓటమికి గల కారణాలను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విశ్లేషించాడు. తనదైన శైలిలో వ్యంగ్యంగా విదేశీ బ్యాటర్లపై విమర్శలు గుప్పించాడు. మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ తీసుకునే డబ్బుకు కొంచెం అయినా న్యాయం చేసేలా ఆడాలని సెహ్వాగ్ అన్నాడు. విరాట్ కోహ్లి మంచి ఇన్నింగ్స్యే ఆడాడని, కానీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఒత్తిడికి గురయ్యాడని పేర్కొన్నాడు.
''ఆర్సీబీ మరో 20 పరుగులు చేయాల్సింది. విరాట్ కోహ్లి గురించి మాట్లాడాలంటే.. అతని ఇన్నింగ్స్ గొప్పగానే ఉంది. కానీ అతడికి గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ వంటి ఆటగాళ్ల నుంచి సహకారం లభించలేదు. దినేశ్ కార్తీక్ అసలు బ్యాటింగ్కు రాలేదు. మహిపాల్ లోమ్రార్ అసలు జట్టులో లేడు. దీంతో ఆఖర్లో ఇన్నింగ్స్ను ఘనంగా ముగించలేకపోయారు''
''కోహ్లి స్ట్రైక్రేటు పెరిగే అవకాశం ఉంది. అతను 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత 200 స్ట్రైక్రేటుకు చేరుకోవచ్చు. కానీ మిగిలిన బ్యాటర్లు ఏం చేయలేకపోయారు. దీంతో కోహ్లిపై భారం పెరిగింది.అతను ఫామ్లో ఉన్నాడు. ఇన్నింగ్స్ చివరు వరకు నిలబడే పాత్రకు అతను న్యాయం చేశాడు. భారీ డబ్బు తీసుకునే మాక్స్వెల్ వంటి ఆటగాళ్లు తమ సత్తాను నిరూపించుకోవాలి. కానీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఎవరూ ఏమీ చేయలేకపోయారు'' అని సెహ్వాగ్ అన్నాడు.