క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ఇవాళ రిలీజ్ కానుంది. సాయంత్రం 5 గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రస్తార కార్యక్రమంలో షెడ్యూల్ విడుదల చేయనున్నారు. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఫైనల్ను మే 26న నిర్వహించాలని షెడ్యూల్ చేస్తున్నారు. అయితే ఇవాళ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 15 రోజుల వరకు తొలుత షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం.

ఎన్నికల షెడ్యూల్ ఖరారైన తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ ప్రకటించాలని లీగ్ నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే లీగ్ మొత్తం భారత్లోనే జరుగుతుందని, విదేశాల్లో జరిగే అవకాశం లేదని ఐపీఎల్ అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు మార్చి 22వ తేదీన ధోనీ బరిలోకి దిగుతాడని తెలియడంతో సీఎస్కే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. గత ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోనీ ఎల్లో జెర్సీని ధరించని విషయం తెలిసిందే.
ఐపీఎల్-2024కు అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుక నిర్వహించాలని లీగ్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ లీగ్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ 'ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. తొలిమ్యాచ్లో సీఎస్కే తమ సొంతగడ్డపై ఆడనుంది. అయితే చెన్నై ప్రత్యర్థి ఎవరో మీరే చెప్పండి' అంటూ ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లను ఆప్షన్స్గా ఇచ్చి ట్విటర్లో ఓటింగ్ పెట్టింది. గత సీజన్ ఫైనల్ జట్లతోనే కొత్త సీజన్లో తొలి మ్యాచ్ ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.