వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలైపోయాయి. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం కోసం అందరూ రెడీ అవుతున్నారు. సాధారణంగా ప్రతి ఏడాదీ ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ జరుగుతుంది. కానీ ఈసారి ఈ నెలల్లో ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదు.
దీని వెనుక ఒక కీలకమైన కారణం కూడా ఉంది. భారత దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికలను కూడా మే-జూన్ నెలల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోందట. అదే జరిగితే ఐపీఎల్ను మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ను బట్టి ఐపీఎల్ 2024 షెడ్యూల్ ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.

అంతేకాదు, జూన్ నెలలోనే టీ20 వరల్డ్ కప్ కూడా ఉంది. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే ఎలాంటి ప్లేయర్కు అయినా కష్టమే. కాబట్టి ఆటగాళ్లకు కొంత విశ్రాంతి కూడా కావాలి. దీంతో కచ్చితంగా ఈలోపే ఐపీఎల్ ముగిసేలా షెడ్యూల్ తయారు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలతో కూడా ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ అవ్వకూడదు.
సార్వత్రిక ఎన్నికలకు ఎంతో భద్రత అవసరం. దీంతో అదనంగా ఐపీఎల్ మ్యాచులకు భద్రత కల్పించడం పోలీసులకు తలకు మించిన భారం అవుతుంది. అయితే ఐపీఎల్ నిర్వహణకు ఇంత కన్నా పెద్ద సమస్యలే గతంలో వచ్చాయి. కరోనా వంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని ఐపీఎల్ను నిర్వహించారు.
కాబట్టి త్వరలోనే ఈ షెడ్యూలింగ్ సమస్యను కూడా బీసీసీఐ అధిగమిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ముందు ఎన్నికల షెడ్యూల్ వస్తే.. దాన్ని బట్టి ఐపీఎల్ షెడ్యూల్ రెడీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2009, 2014, 2019లో కూడా ఐపీఎల్కు ఇలాంటి సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే.