RR vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ శనివారం తన నాలుగో మ్యాచ్ ఆడబోతోంది. సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొననుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు మొదలవుతుంది. వీకెండ్ అయినప్పటికీ..రేపు ఒక్క మ్యాచే షెడ్యూల్ అయింది.
రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర సాగిస్తోంది ఈ టోర్నమెంట్లో. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లనూ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ నెగ్గితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లల్లోనూ సత్తా చాటుతోంది. తొలుత బ్యాటింగ్కు దిగితే ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తోంది. ఛేజింగ్కు దిగితే విజృంభించి ఆడుతోంది. తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను ఖంగు తినిపించింది. 20 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. రెండో మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ను దెబ్బతీసింది. మూడో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను జయకేతనం ఎగురవేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. మూడింట్లో ఓడింది. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులోనూ ఓడిందంటే పరువు పోగొట్టుకుంటుంది ఆర్సీబీ.
దూకుడు మీద ఉన్న రాజస్థాన్ రాయల్స్ను ఆర్సీబీ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఈ పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. శనివారం నాటి మ్యాచ్లో జెర్సీని మార్చివేసింది. పూర్తిగా పింక్ కలర్తో నిండివున్న జెర్సీతో బరిలోకి దిగబోతోంది.
దీనికి కారణం లేకపోలేదు. ఆర్సీబీతో జరిగే మ్యాచ్ను తమ రాష్ట్రంలో నివసించే మహిళలందరికీ అంకితం ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. కొత్త జెర్సీని టీమ్ డైరెక్టర్ కుమార సంగక్కార ఆవిష్కరించారు కూడా. ఔరత్ హై తో భారత్ హై, పింక్ ప్రామిస్ కాన్సెప్ట్తో మ్యాచ్ ఆడబోతోందా జట్టు.
ఈ మ్యాచ్ కోసం విక్రయించే ప్రతి టికెట్పై వచ్చే మొత్తంలో 100 రూపాయలను మహిళ సంక్షేమానికి కేటాయిస్తుంది రాజస్థాన్ రాయల్స్. రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్కు ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూతను కల్పించడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. అలాగే రెండు ఇన్నింగుల్లోనూ సిక్స్ పడిన ప్రతీసారీ సంబార్ రీజియన్లోని ప్రతి ఆరు ఇళ్లల్లో సోలార్ పవర్ ద్వారా దీపాలను వెలగిస్తుంది.