Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపరకు బ్రేకులు పడట్లేదు. భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటివరకు అయిదు మ్యాచ్లను ఆడిన రాయల్ ఛాలెంజర్స్.. గెలిచింది ఒక్కటంటే ఒక్కటి మాత్రమే. నాలుగింట్లో ఓడిపోయింది.
శనివారం రాత్రి జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో మట్టికరిచింది రాయల్ ఛాలెంజర్స్. తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ను జమ చేసినా.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల దూకుడు ముందు అది ఏ మాత్రం సరిపోలేదు.

ఇంకా అయిదు బంతులు మిగిలివుండగానే 189 పరుగులు చేసింది పింక్ టీమ్. ఈ క్రమంలో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రియాన్ పరాగ్- 4, ధృవ్ జురేల్- 2 పరుగులు చేశారు గానీ జోస్ బట్లర్, కేప్టెన్ సంజు శాంసన్.. బౌలర్ల దుమ్ము దులిపారు.
ప్రత్యేకించి బట్లర్ ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. 100 పరుగులు చేశాడు. ఇది అతనికి 100 మ్యాచ్. వందో మ్యాచ్లో సెంచరీ చేసిన రెండో ఐపీఎల్ ప్లేయర్ అతనే. గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్ ఈ రికార్డ్ సృష్టించాడు. 58 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు.
ఒక దశలో 200లకు పైగా స్కోర్ చేసే స్థాయిలో కనిపించింది ఆర్సీబీ. డెత్ ఓవర్లల్లో కోహ్లీ గానీ తన బ్రాండ్ గేమ్ను ప్రదర్శించలేకపోయాడు. దూకుడుగా ఆడలేకపోయాడు. అదే సమయంలో వరుసగా గ్లెన్ మ్యాక్స్వెల్, సౌరవ్ చౌహాన్ వికెట్లు పడటం కూడా స్కోర్ మందగించడానికి కారణమైంది.
ఈ పరిణామాలు విరాట్ కోహ్లీపై విమర్శల దాడికి దారి తీశాయి. జోస్ బట్లర్ 58 బంతుల్లోనే 100 పరుగులు చేయడాన్ని ఫ్యాన్స్ కంపేర్ చేసి చూస్తోన్నారు. కోహ్లీ కంటే బట్లర్ చేసిన విన్నింగ్ సెంచరీ గొప్పదంటూ పోస్టులు పెడుతున్నారు. నెమ్మదిగా ఆడినందుకు పనిలో పనిగా కోహ్లీకీ థ్యాంక్స్ చెప్పిన ఫ్యాన్స్ లేకపోలేదు.