ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో సమరానికి సిద్ధమైంది. ఇవాళ జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒకే విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్పై గెలిచిన బెంగళూరు సీఎస్కే, కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.
అయితే ఈ సీజన్లో ఆర్సీబీ సత్తాచాటాలంటే ముందుగా ఆ జట్టు టాస్ గెలవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టాస్ గెలిచిన అనంతరం బెంగళూరు ఛేజింగ్ ఎంచుకోవాలని సూచించాడు. బెంగళూరు బలహీనత బౌలింగ్ కావడంతో తొలుత బౌలింగ్ చేస్తే మంచిదని గవాస్కర్ పేర్కొన్నాడు.

''టాస్ గెలవడం మన చేతుల్లో ఉండదు. కానీ వాళ్లకు ఆ అదృష్టం వస్తే, ఛేజింగ్ ఎంచుకోవాలి. ఆర్సీబీకి ప్రధాన బలం బ్యాటింగ్ కాబట్టి ఛేదన చేయాలి. వాళ్లకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే ఛేజింగ్ ఉత్తమం అని భావిస్తున్నా'' అని గవాస్కర్ అన్నాడు. ఆధునిక క్రికెట్ గురించి మాట్లాడుతూ.. ''మోడర్న్ క్రికెట్ కష్టమైనది. అలాగే వినోదాత్మకమైనది కూడా. ఈ రోజుల్లో బ్యాటర్లు బంతుల్ని ఎక్కువగా వదిలేయట్లేదు. స్విచ్ షాట్స్, రివర్స్ స్కూప్స్ వంటి రకరకాల షాట్లు ఆడుతున్నారు. మరోవైపు షైన్ బాల్స్ను ఎక్కువగా ఉపయోగించట్లేదు'' అని గవాస్కర్ తెలిపాడు.
టెస్టు క్రికెటర్ ఆదరణ తగ్గిపోవట్లేదని, సుదీర్ఘ ఫార్మాట్కు క్రేజ్ అలానే కొనసాగుతుందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ''టెస్టు క్రికెట్కు బతికే ఉంది. మూడు లేదా నాలుగు దేశాలు ఇతర జట్లతో అయిదు టెస్టుల సిరీస్ ఆడుతున్నాయి. మిగిలిన దేశాలు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. టెస్టు ఫార్మాట్ను ముందుకు నడిపించడానికి ఈ మార్గం సరిపోతుందని భావిస్తున్నా'' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
కాగా, జైపుర్ వేదికగా జరగనున్న ఆర్సీబీ-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.