రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. జైపుర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయిదు మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఆర్ఆర్ టాప్లో నిలిచింది. ఆడిన నాలుగింట్లో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113*; 72 బంతుల్లో, 12x4, 4x6) అజేయ సెంచరీ సాధించాడు. మరోసారి జట్టును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బట్లర్ (100*; 58 బంతుల్లో, 9x4, 4x6) శతకంతో సత్తాచాటాడు. సిక్సర్తో జట్టును గెలిపించి సెంచరీని అందుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (69; 42 బంతుల్లో, 8x4, 2x6) అర్ధశతకంతో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో టోప్లే రెండు, సిరాజ్, యశ్ దయాల్ తలో వికెట్ తీశారు.

కాగా, మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ఓటమికి గల కారణాలు వివరించాడు. పవర్ప్లే ఆఖరి ఓవర్లో మయాంక్ దగార్ 20 పరుగులు సమర్పించుకోవడం తమ జట్టుకు ప్రతికూలంగా మారిందని డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఆ ఓవర్తో రాజస్థాన్పై ఉన్న ఒత్తిడి తొలగిపోయిందని తెలిపాడు. మయాంక్ దగార్ వేసిన ఆరో ఓవర్లో బట్లర్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.
''విరాట్ కోహ్లి మరోసారి గొప్పగా ఆడాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో వికెట్ అంత అనుకూలంగా లేదు. 190 పరుగుల సరిపోతుందని భావించాం. కానీ మా ఇన్నింగ్స్లో మరో 15-20 పరుగులు చేయాల్సింది. టాస్ గెలవడం కీలకం. ఛేదనలో బ్యాటింగ్కు మరింత అనుకూలంగా మారింది. అంతేగాక మంచు ప్రభావం చూపించింది. మావైపు కోహ్లి అద్భుతంగా ఆడాడు. విరాట్తో పాటు గ్రీన్, దినేశ్ కార్తీక్ మెరిస్తే మేం మరిన్ని పరుగులు సాధించేవాళ్లం. మేం బాగానే ప్రయత్నించాం''
''వికెట్, మంచు ప్రభావంతో ఛేజింగ్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించింది. అలాగే టాస్ గెలవడం రాజస్థాన్కు కలిసొచ్చింది. ఛేదనలో తొలి నాలుగు ఓవర్లు గొప్పగా ఆరంభించాం. కానీ మా స్పిన్నర్ ఓ ఓవర్లో 20 పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్తో ఒత్తిడి రాజస్థాన్ జట్టుపై తొలగి మాపై వచ్చింది. బట్లర్, శాంసన్ క్రీజులో నిలదొక్కుకోవడంతో ఆఫ్ స్పిన్నర్ అయిన మాక్స్వెల్కు బౌలింగ్ ఇవ్వలేదు. అందుకే ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన మయాంక్ దగార్కు బౌలింగ్ ఇచ్చాం. ఈ సీజన్లో అంతకుముందు అతడు మంచి ప్రదర్శన చేశాడు. మరోవైపు లెగ్ స్పిన్నర్ హిమన్షు బౌలింగ్లో వాళ్లు ఎటాకింగ్ గేమ్ ఆడారు'' అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.