జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113*; 72 బంతుల్లో, 12x4, 4x6) అజేయ సెంచరీ సాధించాడు. మరోసారి జట్టును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు.
అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బట్లర్ (100*; 58 బంతుల్లో, 9x4, 4x6) శతకంతో సత్తాచాటాడు. సిక్సర్తో జట్టును గెలిపించి సెంచరీని అందుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (69; 42 బంతుల్లో, 8x4, 2x6) అర్ధశతకంతో అలరించాడు.ఆర్సీబీ బౌలర్లలో టోప్లే రెండు, సిరాజ్, యశ్ దయాల్ తలో వికెట్ తీశారు.

అయితే ఓటమి అనంతరం విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్లు చెమ్మగిల్లాయి. విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నా జట్టు గెలవలేకపోయిందనే బాధతో కోహ్లి కనిపించాడు. డగౌట్లో కూర్చొన్న అతడు ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కాగా, మరోవైపు ఆర్సీబీ ప్లేయర్లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కోహ్లికి ఇతర బ్యాటర్లు సహకరించాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ సీజన్లో అయిదు మ్యాచ్లు ఆడిన కోహ్లి 105 సగటుతో 316 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. కానీ మిగిలిన ఆర్సీబీ బ్యాటర్లు అందరూ కలిసి 496 పరుగులే చేయడం గమనార్హం.
ఈ సీజన్లో ఇప్పటివరకు అయిదు మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క విజయం మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్పై గెలిచింది. కానీ ఆ తర్వాత వరుసగా కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. కాగా, ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ను ఎదుర్కోనుంది.