RR vs RCB: ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 17 మ్యాచ్లు ముగిశాయి. నేడు ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయేది 18వ గేమ్. ఈ రెండు జట్లు కూడా తమ నాలుగో మ్యాచ్ను ఆడబోతోన్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్కు ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. రెండింట్లో ఓడింది. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులోనూ ఓడిందంటే మున్ముందు టోర్నమెంట్లో ముందడుగు వేయడానికి చెమటోడ్చాల్సి ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దీనికి భిన్నం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లల్లో రెండింట్లో గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ మంచి రన్రేట్తో నెగ్గగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు ఉన్నాయి.
కాగా శనివారం జరగబోయే మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తన సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొనబోతోంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు మొదలవుతుంది. వీకెండ్ అయినప్పటికీ..రేపు ఒక్క మ్యాచే షెడ్యూల్ అయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. మూడింట్లో ఓడింది. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులోనూ ఓడిందంటే పరువు పోగొట్టుకుంటుంది ఆర్సీబీ.
రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. టోర్నమెంట్లో జైత్రయాత్ర సాగిస్తోందా జట్టు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లనూ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ నెగ్గితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ఈ మ్యాచ్ కోసం అభిమానులు బారులు తీరుతున్నారు. రెండు రోజుల ముందునుంచే టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. టికెట్ల కోసం గురువారం రాత్రికే సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి చేరుకున్నారు. చాప, దిండు, దుప్పటి పట్టుకొచ్చి మరీ.. స్టేడియంలో గల కౌంటర్ల వద్దే నిద్రించారు. ఐపీఎల్ మ్యాచ్కు ఉన్న క్రేజ్కు అద్దం పట్టిందీ పిక్.