Bhuvaneshwar Kumar: ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు చేరుకున్న తరువాత రాజస్థాన్ రాయల్స్ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కొంది. ప్లేఆఫ్స్లో సత్తా చాటాలనుకునే దశలో వరుసగా నాలుగు మ్యాచ్లల్లో ఘోరంగా ఓడిపోవడం ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టయింది.
బుధవారం రాత్రి గువాహటిలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో అయిదు వికెట్ల తేడాతో ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. దాన్ని అలవోకగా ఛేదించింది పంజాబ్ కింగ్స్. 18.5 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టపోయి విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్తో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బ్యాక్ బోన్ భువనేశ్వర్ కుమార్ పేరు మీద ఉన్న రికార్డు ఇది. దాన్ని కొట్టిపడేశాడు ట్రెంట్ బౌల్ట్. భువనేశ్వర్ను రెండో స్థానానికి నెట్టేశాడు.
ఐపీఎల్ మ్యాచ్లల్లో తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన రికార్డు అది. ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ 27 సార్లు ఈ ఫీట్ను సాధించాడు. ఐపీఎల్లో 27 మ్యాచ్లల్లో తొలి ఓవర్లోనే వికెట్ను తీసుకున్నాడు భువి. ఇప్పుడు దాన్ని అధిగమించాడు ట్రెంట్ బౌల్ట్. 28 సార్లు ఈ తొలి ఓవర్లోనే వికెట్ సాధించిన బౌలర్గా అగ్రస్థానంలో నిలిచాడు.
పంజాబ్ కింగ్స్పై జరిగిన మ్యాచ్లో తన తొలి ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ను పెవిలియన్ దారి పట్టించాడు బౌల్ట్. మిడిల్ స్టంప్ మీద పడ్డ స్ట్రెయిట్ డెలివరీని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు ప్రభ్సిమ్రన్. టాప్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్మ్యాన్ వైపు గాల్లోకి ఎగిరిన బంతిని యుజ్వేంద్ర చాహల్ రన్నింగ్లో అందుకున్నాడు. దీనితో ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్.