రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. కెప్టెన్ సంజు శాంసన్ (82; 52 బంతుల్లో) సూపర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా రియాన్ పరాగ్ (43; 29 బంతుల్లో) కూడా చెలరేగడంతో లక్నో సూపర్ జెయింట్స్కు రాజస్థాన్ 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆర్ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కలేదు. జోస్ బట్లర్ (11; 9 బంతుల్లో) ఆదిలోనే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ సూపర్ డైవ్ క్యాచ్కు వెనుదిరిగాడు. వికెట్ పడినా రాజస్థాన్ దూకుడుగానే బ్యాటింగ్ చేసింది. వన్డౌన్లో వచ్చిన శాంసన్తో కలిసి యశస్వీ జైస్వాల్ (24; 12 బంతుల్లో) బౌండరీల మోత మోగించాడు. అయిదో ఓవర్లో జైస్వాల్ ఔటైనప్పటికీ ఆర్ఆర్ పవర్ప్లేలో 54 పరుగులు చేసింది.

కాగా, నాలుగో స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నాలుగో వికెట్కు 93 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో శాంసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. శాంసన్కు తోడుగా రియాన్ కూడా దూకుడు పెంచడంతో పరుగులు పోటెత్తాయి.
అయితే భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి పరాగ్ ఔటయ్యాడు. అంతకుముందు పరాగ్కు రెండు సార్లు లైఫ్ లభించింది. ఖాతా తెరవకముందే ఒక్కసారి, 29 పరుగుల వద్ద మరోసారి లైఫ్ వచ్చింది. మొహ్సిన్ ఖాన్ సులువైన క్యాచ్ను జారవిడిచాడు. కాగా, తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మెయిర్ (5; 7 బంతుల్లో)ను కూడా లక్నో వెంటనే ఔట్ చేసి తిరిగి పోటీలోకి వచ్చింది.
కానీ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (20; 12 బంతుల్లో)తో కలిసి సంజు శాంసన్ స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. శాంసన్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీనుల్ హక్ రెండు వికెట్లు, మోహ్సిన్, రవి బిష్ణోయ్ ఒక్క వికెట్ తీశారు. కృనాల్ పాండ్య నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చాడు. వికెట్ సాధించనప్పటికీ మంచి ఎకానమీరేటుతో బౌలింగ్ చేశాడు.