RR vs GT: ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు పరాజయాన్ని చవి చూసింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మట్టకరిచింది. ఈ సీజన్లో ఈ జట్టుకు ఇదే తొలి ఓటమి. సొంతగడ్డపై 196 పరుగుల భారీ స్కోర్ సాధించినా దాన్ని కాపాడుకోలేకపోయింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, కేప్టెన్ సంజు శాంసన్ ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. 38 బంతుల్లో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో సంజు శాంసన్ 68, 48 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో రియాన్ పరాగ్ 76 పరుగులు చేశారు.

చివరి ఓవర్లో షిమ్రాన్ హెట్మెయిర్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. అయిదు బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్తో 13 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అనంతరం ఛేజింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లల్లో 199 పరుగులతో విజయఢంకా మోగించింది. ఈ క్రమంలో ఏడు వికెట్లను కోల్పోయింది.
తొలి వికెట్ భాగస్వామ్యానికి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఏకంగా 64 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి శుభారంభం చేసినప్పటికీ.. టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడం వల్ల గుజరాత్ టైటాన్స్ ఓ దశలో ఓటమి కోరల్లో చిక్కుకున్నట్టు కనిపించింది. చివర్లో రషీద్ ఖాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 11 బంతుల్లో నాలుగు బుల్లెట్ల వంటి ఫోర్లతో 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అటు మ్యాచ్ ఓటమితో దిగాలుపడ్డ రాజస్థాన్ రాయల్స్కు మరో షాక్ తగిలింది. కేప్టెన్ సంజు శాంసన్పై భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో నుంచి 12 లక్షల రూపాయల కోత పెట్టింది. స్లో ఓవర్ రన్రేట్ను మెయింటెయిన్ చేసినందుకు తొలి తప్పుగా 12 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చింది శాంసన్కు. అదే తప్పు మరోసారి రిపీట్ అయితే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుంది.