ముంబై ఇండియన్స్ మురిసింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఐపీఎల్-2024లో బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా డిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో నెగ్గి పాయింట్ల ఖాతా తెరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ సమష్టిగా పోరాడి 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 234 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో, 6x4, 3x6), ఇషాన్ కిషన్ (42; 23 బంతుల్లో, 4x4, 2x6), టిమ్ డేవిడ్ (45*; 21 బంతుల్లో, 2x4, 4x6) సత్తాచాటారు. ఆఖర్లో షెఫార్డ్ (39*; 10 బంతుల్లో, 3x4, 4x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (71*; 25 బంతుల్లో, 3x4, 7x6) గొప్పగా పోరాడాడు. పృథ్వీ షా (66; 40 బంతుల్లో, 3x4, 4x6), అభిషేక్ పోరెల్ (41; 31 బంతుల్లో, 5x4) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా (2/22), కొయెట్జీ (4/34) ఆకట్టుకున్నారు.

కాగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా తమ విజయానందాన్ని పంచుకున్నారు. 'మేం నిలబడ్డాం.. పరుగు మొదలుపెట్టాం' అని హార్దిక్, 'ఆఫ్ ద మార్క్' అంటూ రోహిత్ క్యాప్షన్ రాసుకొచ్చి.. మ్యాచ్ ఫొటోలు పోస్ట్ చేశారు. అయితే అసలు రచ్చ ఫొటోలతో మొదలైంది. రోహిత్ ఉన్న ఫొటోలను హార్దిక్ పోస్ట్ చేశాడు. కానీ, హార్దిక్ ఉన్న ఫొటోలను మాత్రం హిట్మ్యాన్ పోస్ట్ చేయలేదు. షెఫార్డ్, పంత్లతో కలిసి ఉన్న ఫొటోలు మాత్రమే రోహిత్ ట్వీట్ చేశాడు.
ఇది నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. రోహిత్ శర్మ అభద్రతా భావంతో ఉన్నట్లు స్పష్టమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హార్దిక్ ఫొటోలను ఉద్దేశపూర్వకంగానే రోహిత్ పోస్ట్ చేయలేదని, కెప్టెన్సీ మార్పు అనంతరం హార్దిక్పై రోహిత్కు అసూయ ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను కాదని ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై గూటికి తిరిగొచ్చిన హార్దిక్కు సారథి బాధ్యతలు అప్పగించింది. దీంతో ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయని కథనాలు వస్తున్నాయి.