Rohit Sharma: ఐపీఎల్ 2024లో రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగం టోర్నమెంట్ ముగిసినట్టే. నాలుగు జట్లు మినహా మిగిలినవన్నీ ఏడేసి చొప్పున మ్యాచ్లను ఆడేశాయి. కోల్కత నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ఇంకా ఈ మార్క్ను అందుకోవాల్సి ఉంది.
నేడు చెన్నై సూపర్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తమ ఏడో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ సీజన్ మొత్తానికీ ఇది 34వ మ్యాచ్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఏడింట్లో ఆరు మ్యాచ్లను గెలిచిన జట్టు అది. 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఓడింది ఒక్క మ్యాచ్ మాత్రమే.

అనంతరం కోల్కత నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇదీ- ప్రస్తుతం ఉన్న పాయింట్ల పట్టికలో పొజీషన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఈ టేబుల్లో చివరి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఈ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్కు రెడీ అవుతుంది టీమిండియా. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్లు షెడ్యూల్ కానున్నాయి.
డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ దీని మీదే ఉంది. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు.

ఇంత పెద్ద మెగా ఈవెంట్లో భారత జట్టు ఇన్నింగ్ను ఎవరు ఆరంభిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీ ఎవరనేది ఇప్పటివరకు తేలట్లేదు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా పంపించే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నప్పటికీ- ఐపీఎల్లో అతను వరుసగా విఫలం కావడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి ఓ సలహా ఇచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనర్లుగా ఆడించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓపెనర్లుగా వారిద్దరూ ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్న విషయాన్ని ఆమె పరోక్షంగా గుర్తు చేశారు. అటు రోహిత్, ఇటు విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా ఐపీఎల్లో తమ ప్రత్యర్థులపై సెంచరీలను చేశారు.